పాలమూరు యూనివర్సిటీకి రూ.15 కోట్లు

ముస్లింలతో ముఖ్యమంత్రి ముఖాముఖి
తెలంగాణ ఇవ్వడం కేంద్రం పరిథిలోనిది
ఆదిశగా చర్చలు జురుగుతన్నవి
మహబూబ్‌నగర్‌ సెప్టెంబర్‌ 16 (జనంసాక్షి): ప్రత్యేక తెలంగాణ అంశంపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అంశం రాష్ట్రపరిధిలో లేదని అది కేంద్ర పరిధిలోని అంశమని ఆయన అన్నారు. తెలంగాపై త్వరగా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని తాను కేంద్రాన్ని కోరినట్లు కిరన్‌కుమార్‌రెడ్డి తెలిపారు. జిల్లాలోని ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి మూడో రోజైన ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా పాలమూరు యూనివర్శిటీ విద్యార్థులతో ముఖా ముఖి కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణపై విద్యార్థులు అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానమిచ్చారు. తెలంగాణ వెంటనే ప్రకటించాలని డిమాండ్‌ చేస్తూ ఒక విద్యార్థి వంటిపై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు అడ్డుకుని విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాలమూరు విశ్వవిద్యాలయానికి రూ. 15 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. తమ ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ సంవత్సరం రాష్ట్రంలో 3.2లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని కిరణ్‌ చెప్పారు. ఈ కార్యక్రమంలో సీఎంతోపాటు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, మంత్రి డీకె అరుణ, స్థానిక నేతలు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ఈరోజుతో ఇందిరమ్మబాట కార్యక్రమాన్ని ముగించుకుని సీఎం ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌కు బయలుదేరతారు.
కాగా శనివారం కూడా కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణ అంశంపై స్పందించారు. తెలంగాణపై కేంద్రంలో జరగాల్సిన పని జరుగుతోందని, ఎవరు ఆందోళన చేయాల్సిన అవసరమే లేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. పేదలకు అందించాల్సిన సంక్షేమ పథకాలను పిరశీలించాల్సిన బాధ్యత తనపై ఉందని, తెలంగాణ కావాలంటూ ఆందోళనలు చేస్తే ఎక్కడ ఉన్న తెలంగాణ అక్కడే ఉంటుందని హితవు పలికారు.