పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపి పాఠశాల అభివృద్ధికి సహకరించాలి 

నల్లబెల్లి జూన్ 8 (జనం సాక్షి):
బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపి పాఠశాల అభివృద్ధికి సహకరించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుమారస్వామి పేర్కొన్నారు.  మండలంలోని నారక్కపేట గ్రామంలో మన ఊరు _ మన బడి కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా ఇంటింటా తిరుగుతూ విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపి పాఠశాల అభివృద్ధికి సహకరించాలని కోరారు.ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య అందుతుందని వారికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ మురహరి కిరణ్, గ్రామ ఉపసర్పంచ్ వడ్లూరి రమేష్, పంచాయతీ కార్యదర్శి రహీం, అంగన్వాడి టీచర్ బంద వెంకటలక్ష్మి, వక్కల రమాదేవి, ఆశా వర్కర్, విద్యార్థులు పాల్గొన్నారు.