పూణె ఎక్స్ప్రెస్లో దోపిడీ దొంగ బీభత్సం
వికారాబాద్: పూణె నుంచి హైదరాబాద్ వస్తున్న పూణె ఎక్స్ప్రెస్లో గురువారం తెల్లవారుజామున దోపిడీ దొంగ బీభత్సం సృష్టించాడు. పూణె ఎక్స్ప్రెస్ శంకరపల్లి- నాగులపల్లి సమీపంలోకి రాగానే రిజర్వేషన్ బోగిలో ప్రయాణిస్తున్న మౌలానా(55), కరీమ్ షేక్(21)పై దోపిడీ దొంగ కత్తితో దాడి చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు వికారాబాద్ రైల్వే ఎస్సై తిరుపతి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన ఇద్దరికీ వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించారు. దాడికి పాల్పడిన దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు.