పెట్రోల్‌ దాడి ఘటన.. కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండ

ద్వేలు: వైఎస్‌ఆర్‌ జిల్లా బద్వేలులో పెట్రోల్‌ దాడికి గురై మృతి చెందిన ఇంటర్‌ విద్యార్థిని కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ఆమె కుటుంబానికి సీఎం చంద్రబాబు రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

బుధవారం బాధిత కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. అనంతరం ఇన్‌ఛార్జి కలెక్టర్‌ అదితి సింగ్‌, తెదేపా నేత శ్రీనివాసరెడ్డి చెక్కును అందజేశారు.

పెట్రోల్‌ దాడికి గురై మృతి చెందిన విద్యార్థిని తల్లితో సీఎం చంద్రబాబు ఫోన్‌లో మాట్లాడారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. నిందితుడిని అరెస్టు చేశారని.. కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు ద్వారా విచారణ జరుపుతామని చెప్పారు. బాలిక సోదరుడి చదువు బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ఆమె తల్లికి ఉపాధి కల్పించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.