పోలవరానికి ఇద్దరూ ద్రోహం చేశారు

టిడిపి, వైసిపిలపై మండిపడ్డ తులసిరెడ్డి

అమరావతి,జూలై29(జనంసాక్షి ): పోలవరం ఆలస్యానికి టిడిపి, వైసిపిలే కారణమని కాంగ్రెస్‌ విమర్శించింది.
కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చివుంటే ఈపాటికే పూర్తయ్యేదని, బహుళార్థ సార్థక ప్రాజెక్ట్‌ అని… ప్రకృతి రాష్టాన్రికి ప్రసాదించిన వరమని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ… పోలవరం కాంగ్రెస్‌ పార్టీ మానస పుత్రిక.. జాతీయ ప్రాజెక్ట్‌ అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే 2016 నాటేకే పోలవరం పూర్తి అయ్యివుండేదని చెప్పుకొచ్చారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం, రాష్ట్రంలోని గత టీడీపీ, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాల నిర్వాకం వల్ల ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని ఆయన మండిపడ్డారు. ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకా 30 వేల కోట్ల రూపాయలు కావాలన్నారు. రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలకు నిధులు తెప్పించే శక్తి… సొంతంగా భరించే శక్తి లేదని అన్నారు. కాబట్టి కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంతకాలం పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదన్నారు. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుందని తులసిరెడ్డి స్పష్టం చేశారు.