ప్రధాని మోడీకి స్వాగతం పలికిన మెహబూబా

శ్రీనగర్‌,మే19( జ‌నం సాక్షి): కాశ్మీర్‌ పర్యటనకోసం శ్రీనగర్‌ చేరుకున్న  ప్రధాని నరేంద్రమోడీకి జమ్మూ కాశ్మీర్‌ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఘనస్వాగతం పలికారు. జమ్ము-కాశ్మీర్‌పర్యటనలో భాగంగా ఆయన లేహ్‌, శ్రీనగర్‌, జమ్మూ ప్రాంతాలలో పర్యటించనున్నారు. సిఎం ముఫ్తీతో పాటు నేడు 19వ కుషోక్‌ బకులా రింపోచే శతజయంతి ముగింపు వేడుకల్లో మోడీ పాల్గనడంతో పాటు, లేహ్‌లో జోజి లా సొరంగం పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం జమ్మూలోని హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టును ఆయన ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని స్పందిస్తూ ఇవాళ తనకు చాలా ఆనందంగా ఉందని, తాను జమ్ముకాశ్మీర్‌లో మూడు ప్రాంతాలలో పర్యటించనున్నానని ట్విటర్‌లో పేర్కొన్నారు. ప్రధాని పర్యటన సందర్భంగా జమ్మూ, శ్రీనగర్‌ మార్గాల్లో భారీ భద్రతా ఏర్పాటు చేశారు.