మన హైదరాబాద్‌ గంగా-జమున సంస్కృతిని అధ్యాయంన చేసేందుకు ప్రపంచ దేశాల ఆసక్తి

హైదరాబాద్‌, జనవరి 4 (జనంసాక్షి) :

మన హైదరాబాద్‌ గంగా-జమున సంస్కృతిపై ప్రపంచ దేశాలు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇక్కడి హిందూ ముస్లిం లు అన్నాదమ్ముల్లా కలిసి మెలిసి జీవించే విధానంపై అధ్యయనం చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈమేరకు చైనా జపాన్‌ల నుంచి కొంత మంది సందర్శకులు హైదరాబాద్‌ వచ్చారు. వారికి నగరంలోని కోన్ని కుటుంబాలు ఆతిధ్యం ఇచ్చాయి. హిప్పోక్లబ్‌ పేరిట జపాన్‌, చైనాలోని ఒక సంస్థ ఇతర దేశాల సంస్కృతిని అధ్యయనం చేసేందుకు అవకాశం కల్పిస్తుంది. ఝాంగ్‌ యువెన్‌ అనే యువతి తన తల్లితో కలిసి ఇక్కడకు వచ్చింది ‘భారతీయ సినిమాలు చైనాలో చాలా ప్రజాదరణ పొందాయి. ఇక్కడి సంగీతం అంటే మవాళ్లు చాలా ఇష్ట పడతారు. ‘3 ఇడియట్స్‌’ చిత్రం చూసి చాలా ఆనందపడ్డాను. ఇక విద్యాపరమైన సమస్యలు ఇక్కడా అక్కడా ఒకటేనని తెలుసుకున్నాను. ఇక అమీర్‌ఖాన్‌ ‘తారే జమీన్‌ పర్‌’ నన్ను చాలా ఆలోచింపజేసింది.’ అని చెప్పారు. జపాన్‌ నగోయా నుంచి వచ్చిన గృహిణి కిమికో హటోరి మాట్లాడుతూ ‘భారతీయుల ఆతిధ్యం మరచిపోలేను, ఆహారం చాలా బాగుంది. కాని చేతితో తినటం నాకు చాలా కష్టమనిపించింది. ఇక పారిశుద్ధ్య నిర్వహణకు మేం టిష్యూపేపర్స్‌ వాడతాం. కాని ఇక్కడి ఇళ్లలో అవి కనిపించలేదు. అంతా నీటితోనే శుద్ధి చేసుకోవాలి. ర

విచిత్రమైన అనుభవం.’

జపాన్‌ యాకి నుంచి తన రెండేళ్ల కుమారుడితో వచ్చిన గృహిణి సుమి మికాయే ఇలా అన్నారు. ‘భారతీయుల కళ్లు చాలాపెద్దవి. వారు కళ్లతోనే మాట్లాడతారు. వారి చిరునవ్వులు చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి.’

ఇంకా ఇలా అన్నారు. ‘భారతీయులు అనేకమంది దేవుళ్లను పూజిస్తారు. మేం బుద్ధ భగవానుడిని మాత్రమే ఆరాధిస్తాం.’

19 సంవత్సరాల విద్యార్థి నావో షి మిజు ప్రకారం జపాన్‌లో కొంతమంది బుద్ధుని ఆరాధిస్తారు. చాలామందికి మతం అంటే పెద్ద ఆసక్తి లేదు క్రైస్తవులు ఉన్నా వారి సంఖ్య చాలా స్వల్పమే. కొన్ని సందర్భాలలో పితృదేవతలను పూజిస్తాం. కాని భారతీయుల దేవుళ్లను చూసి మాకు చాలా అద్భుతమనిపించింది. అని చెప్పారు.

రోడ్లపై భిక్షకులను చూసి అతడు చాలా ఆశ్చర్యపోయాడు. చాలా చాలా చిన్న వయసు పిల్లలు అడుక్కుంటున్నారు. చాలా బాధాకరం. జపాన్‌లో భిక్షకులు కనిపించరు. ఇక ఇక్కడ కుటుంబ సంబంధాలు చాలా నచ్చాయి. కాని ట్రాఫిక్‌ చూస్తే భయమేస్తోంది. అని ఆన్నారు.

‘వివిధ దిశలలో నుంచి జనం అలా రోడ్డుపైకి వచ్చేస్తారు. వాహనాలు కూడా అంతే కాని వాటిని నడిపేవారి నైపుణ్యం మొచ్చుకోవాలి’ అని విద్యార్థి కిమికో అన్నారు. రోడ్లపై వాహనాలు జుయ్‌ మని తిరుగుతుంటాయి. పాదచారులు కూడా భయం లేకుండా రోడ్డు దాటేస్తుంటారు. ఇక కొంతమంది అయితే రోడ్డుపైనే నడుస్తుంటారు. చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. కాని అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదాలు జరగటం లేదు. నిర్భయంగా వెళ్లిపోతుంటారు. ఇది మాదేశంలో అసంభవం’ అని చెప్పారు. అలాగే విభిన్న మతాల ప్రజలు కలిసి స్నేహ బంధాలు నెరపడం కొత్త అనుభవమేనని పేర్కొన్నారు. తమ జీవితంలో దర్శించిన అతి పెద్ద సంస్కృతిక నగరం హైదరాబాద్‌ అని వారు పేర్కొన్నారు.ర