ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ

బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ రద్దుకు హైకోర్టు నో

అమరావతి,జూలై29(జనంసాక్షి ): వైసీపీ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. అర్దాంతరంగా బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ రద్దుకు హైకోర్టు నో చెప్పింది. ప్రస్తుత విద్యార్థులు టెన్త్‌ పూర్తయ్యేవరకు కొనసాగించాలని ధర్మాసనం ఆదేశించింది. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ రద్దును హైకోర్టులో మాలమహానాడు సవాల్‌ చేసింది. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల్లో ప్రతిభ కనబరిచినవారికి కార్పొరేట్‌ స్కూల్స్‌లో చదువు కోసం ఈ పథకం అమలులోకి వచ్చింది. ఈ పథకం కింది ఒకటి, ఐదో తరగతుల విద్యార్థులను సాంఘిక సంక్షేమ శాఖ చేర్చుతోంది. 1995లో ప్రవేశ పెట్టిన ఈ పథకాన్ని వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ మాలమహానాడు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ రద్దుకు నో చెబుతూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో 49 వేల మంది ఎస్సీ, ఎస్టీ పిల్లలకు ఊరట లభించనుంది. పిల్లల విద్య కొనసాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.