ప్రభుత్వ అధికారులను ఆదేశించిన‌ కర్ణాటక సీఎం

బెంగళూర్‌(జ‌నం సాక్షి ) : దుబారా వ్యయాన్ని తగ్గించుకోవాలని కర్ణాటక సీఎం హెచ్‌డీ కుమారస్వామి ప్రభుత్వ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే క్రమంలో కొత్తగా కార్ల కొనుగోలును, నూతన వాహనాల అలవెన్సులకు పంపిన ప్రతిపాదనలను పునఃసమీక్షించాలని ఈ మేరకు ఆయన ఓ అధికారిక ప్రకటనలో కోరారు. కార్యాలయాల పునరుద్ధరణను కూడా అవసరరమైతే వాయిదా వేయాలని కూడా కుమారస్వామి అధికార యంత్రాంగానికి సూచించారు.కీలక సమావేశాల్లో ప్రభుత్వ అధికారులు మొబైల్‌ ఫోన్ల వాడకానికి దూరంగా ఉండాలని కోరారు. సమావేశాల్లో మొబైల్‌ ఫోన్లు వాడరాదని అధికారులను కోరుతూ ఈనెల ఒకటిన సీఎం కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.శాఖల కేటాయింపుపై జేడీఎస్‌, కాంగ్రెస్‌ల మధ్య అవగాహన కుదిరిన అనంతరం కుమారస్వామి ఈ చర్యలు చేపట్టారు.ఇరు పార్టీల మధ్య కుదిరిన అవగాహన ప్రకారం జేడీఎస్‌ ఆర్థిక శాఖను, కాంగ్రెస్‌ హోంమంత్రిత్వ శాఖను చేపడుతుంది. జూన్‌ 6న మంత్రివర్గ విస్తరణ ఉంటుందని సీఎం కుమారస్వామి వెల్లడించిన విషయం తెలిసిందే.