ప్రాజెక్టుల ఆధునీకరణతో మారిన పరిస్థితి

రెండు పంటలకు అందుతున్న సాగునీరు

ఆదిలాబాద్‌,జూలై20(జ‌నం సాక్షి): రైతులు పంటలు సాగుచేసే ప్రతి ఎకరానికి సాగునీరు అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయి. ఇప్పటికే మిషన్‌కాకతీయ ఫథకంలో భాగంగా చేపట్టిన చెరువుల మరమ్మతుల కారణంగా జిల్లాలోని రైతులు రెండు పంటలను సాగు చేసుకుంటున్నారు. ప్రాజెక్టుల ఆధునీకీకరణతో ఆయకట్టు భూములు సస్యశ్యామలంగా మారనున్నాయి.ఇదిలావుంటే జిల్లాలోని తాంసి మండలం వడ్డాడి సవిూపంలో నిర్మించిన మత్తడివాగు ప్రాజెక్టు కుడికాలువనిర్మాణంతో 1200 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ కాలువ నిర్మాణ పనులకు ఇటీవల రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్‌ శాఖ మంత్రి హరీశ్‌రావు శంకుస్థాపన చేశారు. జిల్లాలోని తాంసి, ఆదిలాబాద్‌, జైనథ్‌ మండలాల రైతుల భూములకు సాగునీరు అందించేందుకు తాంసి మండలం వడ్డాడిలో 2004లో మత్తడివాగు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2008 ఆగస్టులో ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యాయి. ఈ కాలువ ద్వారా వడ్డాడి, కప్పర్ల, బండలనాగాపూర్‌, జామిడి, చాందా-టి. సిర్సన్న, భోరజ్‌, సావర్‌గాం, తరోడ, మల్లాపూర్‌ భీంసరి, జందాపూర్‌ గ్రామాల్లోని 8500 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా పనులు చేపట్టారు. ప్రాజెక్టు కుడికాలువ నిర్మాణంతో 1200 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. రైతులు రెండు పంటలు సాగుచేసుకునే అవకాశాలుండడంతో ప్రభుత్వం ఈ కాలువ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.ఈ కాలువ నిర్మాణంతో తాంసి మండలం హస్నాపూర్‌, పొన్నారి, తలమడుగు మండలం ఖోడద్‌ గ్రామాలకు చెందిన రైతులకు ప్రయోజనం చేకూరనుంది. కాలువ నిర్మాణం పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న తమ కల నేరవేరిందని వారు అంటున్నారు.

 

తాజావార్తలు