బంగ్లాలు వదలకుండా పిటిషన్లు

 న్యూఢిల్లీ,మే28( జ‌నం సాక్షి ):  సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం ములాయం సింగ్‌, ఆయన తనయుడు అఖిలేష్‌ యాదవ్‌ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మాజీ ముఖ్యమంత్రులు ప్రభుత్వ బంగ్లాలో నివాసం ఉండరాదని, వెంటనే ఖాళీ చేయాలన్న సుప్రీం ఉత్తర్వులను సవాలు చేస్తూ అత్యన్నత ధర్మాసనంలో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం లక్నోలో నివాసం ఉంటున్న బంగ్లాను ఖాళీ చేయడానికి తమకు రెండేళ్లు గడువు కావాలంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. మాజీ సీఎంలు ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయాలన్న సుప్రీం ఆదేశాలను అనుసరించి యూపీ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రులకు నివాసాలు ఖాళీ చేయవల్సిందిగా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికిప్పుడే ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయలేమని, తమకు కొంత సమయం కావాలంటూ అఖిలేష్‌ యాదవ్‌, ములాయం సింగ్‌, మాయావతి, ఎన్డీ తివారిలు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం విధితమే.