బండికి కేటీఆర్‌ లీగల్‌నోటీసులు

` 48 గంటల్లో క్షమాపణ చెప్పకుంటే కోర్టుకు ఈడుస్తానని హెచ్చరిక
` చవకబారు పబ్లిసిటీ కోసం, మీడియా దృష్టిని ఆకర్షించడానికే అడ్డగోలు మాటలని ఆగ్రహం
హైదరాబాద్‌:ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంపై నిరాధార ఆరోపణలు చేస్తూ అన్ని హద్దులు దాటిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్‌పై భారత రాష్ట్ర సమితి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్ర స్థాయిలో స్పందించారు. మినిమం కామన్‌ సెన్స్‌ లేకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా, అసంబద్ధమైన, దిగజారుడు, థర్డ్‌క్లాస్‌ స్థాయి ఆరోపణలు చేయడం బండి సంజయ్‌ అలవాటుగా మార్చుకున్నారని కేటీఆర్‌ మండిపడ్డారు. రాజకీయాల్లో చవకబారు పబ్లిసిటీ కోసం, మీడియా దృష్టిని ఆకర్షించడానికే ఈ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారన్నారు. కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్‌కు నిఘా వ్యవస్థల పనితీరు, విధానాలపై కనీస అవగాహన, పరిజ్ఞానం, ఇంగిత జ్ఞానం కూడా లేదని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. బాధ్యత గల పదవిలో ఉండి ఇంత బేస్‌లెస్‌ ఆరోపణలు చేయడం ఆయన అజ్ఞానం, నిర్లక్ష్యానికి నిదర్శనమని అన్నారు. ‘‘కేంద్ర మంత్రిగా పనిచేయడం అంటే ఢల్లీి బాసులకు చెప్పులు మోసినంత ఈజీ కాదని బండి సంజయ్‌ ఇప్పటికైనా గ్రహించాలి’’ అని ఎద్దేవా చేశారు.ఫోన్‌ ట్యాపింగ్‌ అంశంపై మాట్లాడిన ప్రతిసారి బండి సంజయ్‌ మరింత దిగజారుతున్నారని, తప్పుడు ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. ‘‘రాజకీయాల్లో పెద్ద జోకర్‌గా మారిన బండి సంజయ్‌ మీడియా హెడ్లైన్ల కోసం, చీప్‌ పబ్లిసిటీ కోసం, వీధి నాటకాలు ఆడుతున్నాడు’’ అని ఘాటుగా విమర్శించారు. బండి సంజయ్‌ ఆరోపణల్లో ఒక్క శాతం నిజం ఉన్నా నిరూపించాలని కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. తక్షణమే ఆ ఆరోపణలను ఉపసంహరించుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బండి సంజయ్‌ చేసిన ఆరోపణల పైన లీగల్‌ నోటీసు పంపిస్తున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. ఈ డిమాండ్‌ను పట్టించుకోకపోతే, 48 గంటల గడువు తర్వాత కోర్టుకు ఈడుస్తానని హెచ్చరించారు.ఫోన్‌ ట్యాపింగ్‌ అనే అంశం ఎంత సున్నితమైనదో, చట్టపరంగా ఎంత కఠినమైనదో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు తెలవకుండానే, కావాలనే వాస్తవాలను వక్రీకరిస్తూ, సాక్ష్యం లేకుండా ఆరోపణలు చేయడం ఆయన రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం అన్నారు. ‘‘తప్పుడు ఆరోపణలు, బజారు స్థాయి మాటలు, చవకబారు పబ్లిసిటీ కోసం చెప్పే అబద్ధాలు %-% ఇవన్నీ బండి సంజయ్‌ కు అలవాటు అయిన రాజకీయాలని, ఇక పైన ఇలాంటి చౌకబారు ఆరోపణలను సహించేది లేదని కేటీఆర్‌ ఘాటుగా హెచ్చరించారు.