బనకచర్లపై భారత రాష్ట్ర సమితి ఎంపీల వాయిదా తీర్మానం

` పార్లమెంట్‌లో అదే రభస
న్యూఢల్లీి(జనంసాక్షి):బనకచర్లపై భారత రాష్ట్ర సమితి ఎంపీలు మరోసారి రాజ్యసభలో వాయిదా తీర్మానం ఇచ్చారు. ఏపీలో నిర్మించే ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని అందులో పేర్కొన్నారు.దీనివల్ల తెలంగాణకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని వెల్లడిరచారు. రాజ్యసభలో భారత రాష్ట్ర సమితి సభ్యుడు సురేశ్‌రెడ్డి తీర్మానం నోటీసు ఇచ్చారు. ఇప్పటికే ఓసారి సభలో బనకచర్లపై వాయిదా తీర్మానం ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రతిపక్షాల ఆందోళలతో పార్లమెంట్‌ దద్దరిల్లింది. సోమవారం ఉదయం ఉభయ సభలు ప్రారంభం కాగానే బీహార్‌ ఓటర్ల జాబితా సవరణపై చర్చ నిర్వహించాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేశాయి. అందుకు ప్రభుత్వం అంగీకరించకపోవడంతో ఆందోళనకు దిగాయి. బీహార్‌ ఓటర్ల జాబితా సవరణపై చర్చ నిర్వహించాల్సిందేనని పట్టుబట్టాయి. బీజేపీతో ఈసీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశాయి. స్పీకర్‌ సముదాయించే ప్రయత్నం చేసిన విపక్షాలు వెనక్కి తగ్గలేదు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో పార్లమెంట్‌ ఉభయ సభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. మరోవైపు.. ఓట్ల చోరీ జరుగుతుదంటూ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఈసీ విచారణ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇండియా బ్లాక్‌ ఎంపీలు పార్లమెంట్‌ నుంచి ఎన్నికల కమిషన్‌ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌ నేతృత్వంలో జరిగిన ఈ ర్యాలీలో ఇండియా కూటమిలోని 25 ప్రతిపక్ష పార్టీల నుంచి 300 మందికి పైగా ఎంపీలు పాల్గొననున్నారు. అయితే, ఇండియా కూటమి నేతల ర్యాలీకి ఢల్లీి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఇండియా బ్లాక్‌ ఎంపీల ర్యాలీపై ఉత్కంఠ నెలకొంది. ఇదిలావుంటే 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, బిహార్‌లో జరుగుతున్న ఎలక్టోరల్‌ రోల్స్‌ స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ సరిగా లేదని ఆరోపిస్తూ ఇండియా కూటమి భారీ ఆందోళనకు సిద్ధమైంది. సోమవారం ఢల్లీిలోని పార్లమెంట్‌ నుంచి ఎన్నికల సంఘం ఆఫీస్‌ వరకు 300 మందికి పైగా ఎంపీలు ర్యాలీ చేయబోతున్నారు. అయితే, ఈ ర్యాలీకి ఢల్లీి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ర్యాలీ నిర్వహణకు సంబంధించి తమకు ఎలాంటి అధికారిక వినతి అందలేదని సీనియర్‌ పోలీస్‌ అధికారులు చెబుతున్నారు. ఇండియా కూటమి మాత్రం ర్యాలీ నిర్వహించి తీరాలని నిర్ణయించారు. ఇలాంటి సమయంలో ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష పార్టీ నేతలతో భేటీకి ఎన్నికల సంఘం అంగీకరించింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పార్లమెంట్‌ సభ్యుడు జైరాం రమేష్‌ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. భేటీకి అవకాశం ఇవ్వాలని కోరారు. జైరాం రమేష్‌ లేఖపై ఎన్నికల సంఘం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు జైరాం రమేష్‌కు ఎన్నికల సంఘం సెక్రటరీ అశ్వినీ కుమార్‌ మోహల్‌ ఆదివారం రాత్రి లేఖ రాశారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. ఎక్కువ మంది పట్టే అవకాశం లేనందున కేవలం 30 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. సుకుమార్‌ సెన్‌ హాల్‌లో సమావేశం జరగనుంది. అయితే, ఎన్నికల సంఘం భేటీకి అంగీకరించిన నేపథ్యంలో ర్యాలీపై ఇండియా కూటమి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. కాగా, 2024 ఎన్నికల్లో కర్ణాటకలోని బెంగళూరు సెంట్రల్‌ నియోజకవర్గంలోని మహదేవపుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో దాదాపు 1,00,250 ఓట్లు చోరీ అయ్యాయని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపిస్తున్నారు.