బిజెపి హెచ్చరికలను ఖాతరు చేయబోం
ముఖ్యమంత్రి కుమారస్వామి
బెంగళూరు,మే25(జనంసాక్షి): బిజెపి బెదరింపులకు, వారి హెచ్చరికలకు ప్రభుత్వం మోకరిల్లదని, తనపని తాను చేసుకుంటూ పోతుందని కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి స్పస్టం చేశారు. రైతులను ఎలా ఆదుకోవాలో తమకు బాగా తెలుసన్నారు. అసెంబ్లీలో బీజేపీ సీనియర్ నేత యడ్యూరప్ప వ్యవహరించిన తీరు, తమ ప్రభుత్వాన్ని బెదరించడంపై తప్పుపట్టారు. యడ్యూరప్ప దయనీయ పరిస్థితికి ఆయన వ్యాఖ్యలు అద్దంపడుతున్నాయని అన్నారు. కుమరస్వామి బలపరీక్ష సందర్భంగా యడ్యూరప్ప
మాట్లాడుతూ, రైతుల రుణాలు 24 గంటల్లో మాఫీ చేయకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అనంతరం ఈ వ్యాఖ్యలపై కుమారస్వామి విూడియాతో తొలిసారి స్పందించారు. ‘యడ్యూరప్ప మాట్లాడిన తీరు బాగోలేదు. ఆయన వయస్సు, అనుభవం పరిగణనలోకి తీసుకుంటే ఆయన మాట్లాడిన తీరు అత్యంత దయనీయం’ అని కుమారస్వామి అన్నారు. ఆయనను చూస్తే జాలేస్తోందన్నారు. ఆయన బెదరింపులకు ఇక్కడ ఎవరూ బయపడేది లేదన్నారు. యడ్యూరప్పు గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చిన హావిూలు, ఆ హావిూలు అమలు చేయకుండా వ్యవహరించిన తీరు, రాజకీయాల్లో ఆయన ఎంత ‘ఫ్రాడ్’గా మారారో తమకు అన్నీ తెలుసుసని పేర్కొన్నారు. ఆయన హెచ్చరికలు ఎలా తిప్పికొట్టాలో తమకు చాలా బాగా తెలుసునని అన్నారు. కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్, జేడీఎస్ ఇచ్చిన హావిూలను నెరవేర్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని, అసలు పని ఇప్పుడే మొదలైందని చెప్పారు. 28న రాష్ట్ర వ్యాప్త బంద్ చేస్తాంటూ బీజేపీ బెదరింపులను ఖాతరు చేసేదే లేదని కుమారస్వామి స్పష్టం చేశారు.