బిట్‌కాయిన్‌ స్కాంలో రాజ్‌కుంద్రా?

– విచారణ చేపట్టిన అధికారులు
న్యూఢిల్లీ, జూన్‌5(జనం సాక్షి) : బాలీవుడ్‌ హీరోయిన్‌ శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రా మరోసారి చిక్కుల్లో పడ్డారు. బిట్‌కాయిన్‌ కుంభకోణంలో అతడి పేరు బయటికి రావడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కుంద్రాకు మంగళవారం సమన్లు జారీ చేసింది. దీనిలో భాగంగానే ముంబయిలో ఈడీ కార్యాలయంలో అధికారులు అతని పాత్రపై ప్రశ్నిస్తున్నారు. రూ.2వేల కోట్ల బిట్‌కాయిన్‌ మైనింగ్‌ స్కాంలో ప్రధాన నిందితుడైన అమిత్‌ భరద్వాజ్‌తో పాటు కుంద్రాకు ఉన్న సంబంధాలపై విచారణ జరుపుతున్నారు.
భరద్వాజ్‌ను ఏప్రిల్‌ 5న పోలీసులు అరెస్ట్‌ చేశారు. భారీ మోసంలో కుంద్రా పాత్ర ఉన్న నేపథ్యంలో అతన్ని విచారిస్తున్నారా? లేక భరద్వాజ్‌ చేతిలో మోసపోయిన వారిలో కుంద్రా కూడా ఒక పెట్టబడిదారా? అనే విషయం తెలియాల్సి ఉంది. గతంలో వెలుగు చూసిన ఐపీఎల్‌ స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణంలో రాజ్‌కుంద్రా నిందితుడిగా తేలిన విషయం తెలిసిందే.