బూటకపు ఎన్‌కౌంటర్లను నిరసిస్తూ జూలై 5న

దండకారణ్య బంద్‌కు మావోయిస్టుల పిలుపుఛత్తీస్‌గఢ్‌                                                     జూన్‌ 30(జనంసాక్షి): ఛత్తీస్‌గఢ్‌ లోని బసాగూడలో ఎన్‌కౌంటర్‌ పేరుతో దాదాపు 20మందిని చంపివేయడాన్ని సిపిఐ మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండిం చింది. ఎన్‌కౌంటర్‌కు నిరసనగా జూలై5న దండ కారణ్య బంద్‌కు ఆ పార్టీ దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కార్యదర్శి గుడిసె ఉసెండి పిలుపు నిచ్చారు. గ్రీన్‌హంట్‌ పేరుతో ఆదివాసీల హత్యకు ప్రభుత్వం కుట్ర పన్నిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. దీనిని ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు తీవ్రంగా ఖండించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం బహుళజాతి కంపెనీలకు వంత పాడుతూ గిరిజనులు,ఆదివాసీలను భయబ్రాంతులకు గురి చేస్తున్నదని ఆయన ధ్వజమెత్తారు. ఎన్‌కౌంటర్‌ల పేరుతో భద్రతాదళాలు గిరిజన గ్రామాలపై దాడులు చేసి ఆదివాసీ యువకులను మావోయిస్ట్లుల పేరుతో చిత్రహింసలకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీనికి ఈ నెల 28,29వ తేదీల్లో జరిగిన బసాగూడ ఘటన ప్రత్యక్ష సాక్షమని ఆయన పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో ప్రత్యేకంగా దండకారణ్యంలోని గిరిజన గ్రామాల్లో తీవ్ర నిర్బందకాండ,దమన కాండలకు ఈ ఘటనే నిదర్శనమన్నారు. కేంద్రప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ గ్రీన్‌హంట్‌ను వెంటనే నిలిపివేయాలని, బసాగూడ ఎన్‌కౌంటర్‌ ఘటనకు బాధ్యులైన అధికారులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్‌ చేశారు..