బెజవాడ కనకదుర్గమ్మ దర్శించుకోన్న తెలంగాణ గవర్నర్‌ తమిళసై

విజయవాడ: బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ గవర్నర్‌ తమిళసై అన్నారు. విజయవాడ కనక దుర్గమ్మను ఆమె ఇవాళ దర్శించుకున్నారు.

ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్‌ నుంచి.. తొలుత ఇండిగో విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. విమానాశ్రయంలో కలెక్టర్ రాజాబాబు, ఇతర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఇంద్రకీలాద్రికి చేరుకున్న గవర్నర్‌ తమిళసైకు దుర్గామల్లేశ్వరస్వామి దేవాలయం పాలకమండలి ఛైర్మన్‌ కర్నాటి రాంబాబు, ఈవో భ్రమరాంబ, వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

అమ్మవారిని దర్శించుకున్న అనంతరం తమిళసైకి పండితులు వేదాశీర్వచనం అందించారు. దేవస్థానం తరఫున అమ్మవారి ప్రసాదం, చిత్రపటాన్ని ఇచ్చారు. చంద్రయాన్- 3 విజయవంతమైనందుకు సంతోషంగా ఉందని, ఆదిత్య-ఎల్‌ 1 విజయవంతం కావాలని దుర్గమ్మను వేడుకున్నట్లు ఈ సందర్భంగా గవర్నర్‌ తమిళసై తెలిపారు.