భారత్‌కు అపాచీ హెలికాప్టర్లు

ఆరింటిని విక్రయానికి అమెరికా ఆమోదం
930 మిలియన్‌ డాలర్లకు ఒప్పందం
వాషింగ్టన్‌, జూన్‌13(జ‌నం సాక్షి) : భారత సైన్యానికి ఆరు అత్యాధునిక అపాచీ యుద్ధ హెలికాప్టర్లను విక్రయించేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. 930 మిలియన్‌ డాలర్ల వ్యయం చేసే ఆరు ‘ఏహెచ్‌-64ఈ’ అపాచీ అటాక్‌ హెలికాప్టర్లను విక్రయించేందుకు ఒప్పందం కుదిరిందని అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది. ఒప్పందం ఆమోదం కోసం యూఎస్‌ కాంగ్రెస్‌కు చేరింది. అయితే ప్రజాప్రతినిధులు ఎవరూ దీనిపై అభ్యంతరాలు తెలపకపోతే ఈ ఒప్పందం ముందుకు వెళ్లనుంది. భారత్‌లో ఏర్పాటు చేసిన ప్లాంట్‌లోనే బొయింగ్‌, టాటా సంస్థలు కలిసి అపాచీ హెలికాప్టర్‌కు సంబంధించిన ప్రధాన బాడీని తయారు చేయడం ప్రారంభించినప్పటికీ.. పూర్తిగా తయారుచేసిన హెలికాప్టర్లను అమెరికా నుంచి నేరుగా ఈ ఒప్పందం ద్వారా కొనుగోలు చేయనున్నారు. ఒప్పందం ద్వారా అపాచీ హెలికాప్టర్లతోపాటు అత్యాధునిక నైట్‌ విజన్‌ సెన్సార్లు, జీపీఎస్‌ గైడెన్స్‌, స్టిం/-రగర్‌ ఎయిర్‌-టు-ఎయిర్‌ క్షిపణులు కూడా సమకూరనున్నాయి. ఈ అపాచీ హెలికాప్టర్లతో భారత రక్షణ సామర్థ్యం మరింత బలోపేతం కానుందని యూఎస్‌ ఢిఫెన్స్‌ సెక్యూరిటీ కోఆపరేషన్‌ ఏజెన్సీ వెల్లడించింది.