భీంగల్‌ మండలంలో రెండు పాజిటివ్‌ కేసులు

నిజామాబాద్‌,ఆగస్ట్‌11(జనం సాక్షి): భీంగల్‌ పట్టణ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారిణి డాక్టర్‌ సుచరిత తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం పరిధిలో మొత్తం నలుగురికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చినట్లు, మిగతా ఇద్దరికి నెగిటివ్‌ వచ్చయని, పాజిటివ్‌ వచ్చిన వారికి హూమ్‌ ఐసోలేషన్‌లో ఉండేవిధంగా పలు సూచనలు చేసి కిట్లు ఇచ్చామని, అందరూ స్వీయ నియంత్రణ పాటించాలని, మాస్క్‌ ధరించి, భౌతికదూరం పాటించాలని కోరారు. ఇకపోతే మోర్తాడ్‌ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షలో పాజిటివ్‌ వచ్చినట్లు మండల వైద్యాధికారి డాక్టర్‌ రవి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రం పరిధిలో మొత్తం నలుగురికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌ వచ్చినట్లు తెలిపారు. కరోన బాధితుడికి కిట్‌ అందజేశామని, ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ, మాస్కులు తప్పకుండా ధరించాలని, తరచుగా శానిటైజర్‌ వాడాలని ఆయన కోరారు.