భూ సేకరణ ఆర్డినెన్స్నకు రాష్ట్రపతి ఆమోదం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 3 : కేంద్రం ప్రతిపాదించిన భూ సేకరణ ఆర్డినెన్స్ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం ఆమోద ముద్ర వేశారు. భూ సేకరణ ఆర్డినెన్స్ను రాష్ట్రపతి ఆమోదం తెలపడం ఇది రెండోసారి. మొదటి ఆర్డినెన్స్ కాలపరిమితి కొద్ది రోజుల క్రితమే తీరిపోయింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో ఆ బిల్లును ఆమోదింపజేసుకోడానికి మోదీ సర్కార్ ప్రయత్నించింది. అయితే రాజ్యసభలో మోదీ ప్రభుత్వానికి సంఖ్యాబలం లేదు. దాంతో ప్రతిపక్షాలు భూ సేకరణ బిల్లును చట్టం చేయకుండా అడ్డుకోగలిగాయి.
ఒక దశలో కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి… బిల్లుకు ఆమోదం పొందేలా ప్రయత్నించింది. తర్వాత వ్యూహం మార్చుకుంది. ఆర్డినెన్స్ను మరొసారి పొడిగించింది. ఇప్పుడు భూసేకరణ ఆర్డినెన్స్కు రాష్ట్రపతి రెండోసారి ఆమోదం తెలిపారు. ఈ ఆర్డినెన్స్ ఆరు నెలలపాటు అమలులో ఉంటుంది.