భోపాల్లో ట్రక్కు – ప్రైవేటు బస్సు ఢీ
– 10 మంది మృతి
భోపాల్, మే21(జనం సాక్షి) : మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో రుతియార్ వద్ద ప్రైవేటు బస్సు – ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడాదిన్నర బాలిక ఉంది. మరో 47 మంది తీవ్రంగా గాయపడ్డారు. యూపీలోని బాందా నుంచి అహ్మదాబాద్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ట్రక్కు ఇంజిన్లో సమస్య తలెత్తడంతో.. దాన్ని రోడ్డుపైనే నిలిపి ఉంచారు ట్రక్కు డైవర్.
ఈ క్రమంలో వేగంగా వచ్చిన ప్రైవేటు బస్సు.. ట్రక్కును ఢీకొట్టింది. బస్సు డ్రైవర్, కండక్టర్ ఇద్దరూ మృతి చెందారు. చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.