మజ్లిస్ భయంతోనే విమోచనకు స్వస్తి
ప్రజలకు కెసిఆర్ సమాధానం ఇవ్వాలి: బిజెపి
వరంగల్,సెప్టెంబర్6 (జనం సాక్షి ) : టిఆర్ఎస్ నేతలకు మజ్లిస్ భయం పట్టుకుందని, రజాకర్ల పార్టీ అయిన దానికి లొంగిపోయారని వరంగల్ బిజెపి నేత ధర్మారావు విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో విమోచనపై కెసిఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఆత్మగౌరవ పోరాటం అన్న కేసీఆర్ ఇప్పుడు విమోచనదినాన్ని మరవడం సిగ్గుపడాలని అన్నారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా విమోచన దినాన్ని ఎందుకు జరపటం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణకు అడుగడుగునా అడ్డుపడిన మజ్లిస్ మెప్పు కోసం తెలంగాణ ఆత్మ గౌరవాన్ని సీఎం కేసీఆర్ తాకట్టు పెడుతున్నారని అన్నారు. ఇదంతా మజ్లిస్ను బుజ్జగించడానకే అన్నారు. దీంతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా విమోచన పోరాటాన్ని ప్రస్తావించకపోవడం, దానిని గురించి చెప్పక పోవడం దారుణమన్నారు.సెప్టెంబర్ 17 న జాతీయ పతాకం ఎగురవేయటం సీఎం నైతిక బాధ్యతని గుర్తుచేశారు. చరిత్రను ఓటు బ్యాంక్ రాజకీయాలతో ముడిపెట్టకూడదని, పరిస్థితి మారకుంటే రాబోయే రోజుల్లో కేసీఆర్ చరిత్ర హీనుడుగా మిగులుతారని విమర్శించారు. ఈ ఐదేళ్లలో ఒక్కసారి కూడా నిర్వహించక పోవడంచూస్తుంటే కెసిఆర్ వైఖరి గమనించవచ్చని అన్నారు. ఈ అంశాన్ని కనీసం పాఠ్యాంశాల్లో చేర్చక పోవడం దారుణమని, ఉద్యమ సమయంలో సీఎం రోశయ్యను డిమాండ్ చేసిన కేసీఆర్ ..ఇప్పుడెందుకు మౌనంగా ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు. ప్రజలు ముఖ్యమా..లేక మజ్లీసా తేల్చుకోవాలని హెచ్చరించారు. అధికారికంగా సెప్టెంబర్ 17 విమోచనోత్సవం జరపక పోతే తెరాసకువచ్చే ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు.