మధుసూధనాచారికి మద్దతుగా టిబిజికెఎస్‌ ప్రచారం

 

జయశంకర్‌ భూపాలపల్లి,నవంబర్‌27(జ‌నంసాక్షి): భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి ఎంతగానో కృషి చేశారని, అభివృద్ధిని గుర్తించి మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌)భూపాలపల్లి బ్రాంచి కమిటీ ఉపాధ్యక్షులు కొక్కుల తిరుపతి కోరారు. భూపాలపల్లి పట్టణంలో టీబీజీకేఎస్‌ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ సింగరేణి కార్మిక సంక్షేమానికి చేసిన మేలును వివరిస్తూ ముందుకు సాగారు. అనేక సంక్షేమ సర్క్యూలర్‌లు జారీ చేయించి అమలు చేసి కార్మిక ప్రయోజనానికి పాటుపడ్డారన్నారు.సింగరేణి కార్మికుల వారసులకు కారుణ్య నియమాకాల పక్రియ ద్వారా ఉద్యోగాల భర్తీ వేగవంతంగా కొనసాగుతుందన్నారు. సింగరేణి కార్మికుల తల్లిదండ్రులకు ఉచిత వైద్యం అందించడం, కంపెనీ క్వార్టర్లలో ఏసీ సౌకర్యం కల్పన, మ్యాచింగ్‌ గ్రాంట్‌ పెంపు తదితర అనేక ప్రయోజనాలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేకూర్చిందన్నారు.