మధ్యప్రదేశ్‌పై రాహుల్‌ దృష్టి

– నవంబర్‌లో ఎన్నికలు?
– దిగ్విజయ్‌, సింధియాకు కీలక బాధ్యతలు అప్పగించిన రాహుల్‌
న్యూఢిల్లీ, మే22(జ‌నం సాక్షి ) : త్వరలో జరుగనున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కీలక నియామకాలను చేపట్టారు. పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ను కో-ఆర్డినేషన్‌ కమిటీ చైర్మన్‌గా నియమించారు. జ్యోతిరాదిత్య సింధియాను ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా రాహుల్‌ నియమించారు. మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌లో జరిగే అవకాశాలున్నాయి. ప్రస్తుత బీజేపీ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వం పదవీకాలం 2019 జనవరితో ముగియనుంది. 230 అసెంబ్లీ స్థానాలున్న మధ్యప్రదేశ్‌ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 165 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌ 57 సీట్లు గెలుచుకుంది. బీఎస్‌పీ నాలుగు సీట్లు సాధించింది. 2005 నుంచి సీఎంగా కొనసాగుతున్న శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ నాలుగోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలగా ఉండగా, ఈసారి మధ్యప్రదేశ్‌లో ఎలాగైనా పాగా వేసి సత్తాచాటుకోవాలని, ఎన్నికలకు ముందే బలమైన పొత్తులతో బీజేపీని ఢీకొనాలని కాంగ్రెస్‌ వ్యూహరచన చేస్తోంది.