మళ్లీ కాంగ్రెస్‌లోకి శంకర్‌రావు 


– నామినేషన్‌ ఉపసంహరణ
– కూటమి గెలుపుకు కృషిచేస్తానన్న మాజీ మంత్రి శంకర్‌రావు
రంగారెడ్డి, నవంబర్‌20(జ‌నంసాక్షి) : షాద్‌నగర్‌ టికెట్‌ తనకు కేటాయించలేదని మనస్థాపంతో మాజీ మంత్రి శంకర్‌రావు కాంగ్రెస్‌ను వీడి ఎస్పీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆపార్టీ నుంచి నామినేషన్‌ సైతం వేశారు. కాగా మంగళవారం యూటర్న్‌ తీసుకున్నారు. నామినేషన్‌ను ఉపసంహరించుకొని మళ్లీ కాంగ్రెస్‌ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈసందర్భంగా శంకర్‌రావు మాట్లాడుతూ.. పోటీపై మనసు మార్చుకున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ నేతల విజ్ఞప్తి మేరకు పార్టీలోనే కొనసాగుతున్నట్లు ఆయన మంగళవారం ప్రకటించారు. మహాకూటమి బలపరిచిన టీడీపీ, కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపునకు కృషి చేస్తానని ఆయన వెల్లడించారు. నామినేషన్‌ సందర్భంగా కాంగ్రెస్‌పై శంకర్‌రావు తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
నలభైఏళ్లు పార్టీకి సేవచేసిన తనకు టికెట్‌ ఇవ్వలేదని, పార్టీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి టికెట్లు అమ్మకున్నారని ఆయన ఆరోపించారు. పార్టీ మారి 24గంటలు కూడా కాకముందు ఇలా ప్లేటు పిరాయించడంతో ప్రజలు అవాక్కయ్యారు. కాంగ్రెస్‌ రెబల్స్‌గా నామినేషన్‌ దాఖలు చేసిన మరికొంత మంది నేతలు కూడా ఉపసంహరించుకుంటారని కాంగ్రెస్‌ నేతలు అభిప్రాయపడుతున్నారు. దీని కొరకు ఇప్పటికే నేతలను బుజ్జగించేందుకు అధిష్టానం దూతలను రంగంలోకి దింపినట్లు సమాచారం.