మహాత్మా గాంధీ జ్యోతిబా ఫూలే బాలుర పాఠశాలలో వైద్య శిబిరం

టేకులపల్లి, ఆగస్టు 29 (జనం సాక్షి): మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ జ్యోతిబా పూలే బాలుర పాఠశాలలో సులానగర్ పిహెచ్సి ఆధ్వర్యంలో సోమవారం  డాక్టర్ విరుగు నరేష్  వైద్య శిబిరం  నిర్వహించారు .ఈ శిబిరంలో 45 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి తగు చికిత్సను అందించారు. దగ్గు, జ్వరంతో బాధపడుతున్న 15 మంది విద్యార్థులకు రక్త పరీక్షలు, కోవిడ్ పరీక్షలు చేశారు. కోవిడ్, మలేరియా కేసులు నమోదు కాలేదని తెలిపారు. పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత ఈ సీజన్లో వచ్చే వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లో అపరిశుభ్రమైన ఆహారం ,వీధుల్లోని ఆహారం తీసుకోవద్దని ఆహారం తీసుకునే ముందు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత అత్యంత పరిశుభ్రంగా చేతులు కడుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని వైద్యాధికారి పిల్లలకు సూచించారు . ఈ సీజన్లో వచ్చే వ్యాధులు కీటక జనిత వ్యాధులపై అవగాహన కల్పించారు .అనంతరం వంటశాలను పరిశీలించి  వంట చేసే సిబ్బందికి తగు జాగ్రత్తలు, సూచనలు చేశారు .అత్యంత పరిశుభ్రంగా ఆకుకూరలు, కాయగూరలు పావుగంట ఉప్పు నీళ్లలో నానబెట్టిన తర్వాత పరిశుభ్రంగా  కడిగి పరిశుభ్రమైన ప్రదేశాల్లోనే వాటిని వంటకు తయారు చేయాలని కోరారు.వృధా ఆహారపదార్థాలను ఎప్పటికప్పుడు పంచాయతీ ట్రాక్టర్లో వేసి బ్లీచింగ్ చల్లించడం ద్వారా ఈగలు, దోమలు పెరిగే అవకాశం ఉండదని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సురేష్ రెడ్డి ,సూపర్వైజర్ నాగు బండి వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం పరంగిణి,ప్రసన్న, మజహరి ,రమేష్ బాబు , ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.