2018 ఎన్నికల నుంచే ఫోన్‌ ట్యాపింగ్‌..

` సిట్‌కు లభ్యమైన కీలక ఆధారాలు
` వివాదంలో మరో కీలక పరిణామం
` మాజీ సిఎస్‌ శాంతి కుమారి తదితరుల విచారణ
` వరుసగా ఆరోసారి సిట్‌ విచారణకు ప్రభాకర్‌ రావు
` స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా దాటవేత
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2018 ఎన్నికల వేళ ఫోన్లు ట్యాపింగ్‌ చేసినట్లు సిట్‌ అధికారులకు తాజాగా ఆధారాలు లభించాయి.ప్రణీత్‌రావు నుంచి టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావుకు ట్యాపింగ్‌ సమాచారం చేరేది. ప్రభాకర్‌ రావు ఆదేశాలతోనే టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ రంగంలోకి దిగింది. ఫోన్‌ ట్యాపింగ్‌ ద్వారానే ప్యారడైజ్‌ వద్ద భవ్య ఆనంద్‌ప్రసాద్‌కు చెందిన రూ. 70లక్షల డబ్బును టాస్క్‌ఫోర్స్‌ అధికారులు సీజ్‌ చేసినట్లు సమాచారం.దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినట్లు సిట్‌ అధికారులు గుర్తించారు. ఎన్నికల్లో పోటీ చేసిన రఘునందన్‌రావు బంధువులకు చెందిన రూ. కోటి కూడా ఫోన్‌ ట్యాపింగ్‌తో వచ్చిన సమాచారం మేరకే సీజ్‌ చేశారని తెలుస్తోంది. బేగంపేట పరిధిలో రాధాకిషన్‌రావు, ఆయన బృందం రూ. కోటి సీజ్‌ చేసింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ ఫోన్‌ ట్యాపింగ్‌ జరిగినట్లు సమాచారం. నల్గొండ కాంగ్రెస్‌ నేతల అనుచరుల నుంచి రూ.3.50 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
మాజీ సిఎస్‌ శాంతి కుమారి తదితరుల విచారణ
ఫోన్‌ ట్యాపింగ్‌ వివాదంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తాజాగా ఈ కేసులో స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ (పొలిటికల్‌) రఘునందన్‌ రావులను విచారణకు పిలిచి వారి స్టేట్‌మెంట్లను నమోదు చేసింది. ఇండియన్‌ టెలిగ్రాఫ్‌ యాక్ట్‌ 1885, సెక్షన్‌ 5(2) ప్రకారం, ఫోన్‌ ట్యాపింగ్‌ చేయాలంటే రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి లేదా డీజీపీ అనుమతితో పాటు, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ అనుమతీ తప్పనిసరి. ట్యాపింగ్‌ చేయాల్సిన నెంబర్ల జాబితాను రివ్యూ కమిటీ పరిశీలించి, అనుమతిని కేంద్రానికి పంపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో, ప్రభాకర్‌ రావు నేతృత్వంలోని బృందం సుమారు 618 ఫోన్‌ నెంబర్లను ట్యాపింగ్‌ కోసం రివ్యూ కమిటీకి సమర్పించింది. అప్పట్లో సీఎస్‌గా ఉన్న శాంతి కుమారి ఆ లిస్ట్‌ పంపి టెలికం అనుమతులు తీసుకున్నట్లు సిట్‌ దర్యాప్తులో తేలింది. ఇప్పటికే అదే కేసులో అప్పటి హోంశాఖ కార్యదర్శి, ప్రస్తుత డీజీపీ జితేందర్‌,ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ అనిల్‌ కుమార్‌లకు ప్రశ్నలతో కూడిన నోటీసులు జారీ చేయగా, తాజాగా శాంతి కుమారి, రఘునందన్‌ రావులను స్వయంగా విచారించి స్టేట్‌మెంట్‌ రికార్డు చేశారు. కేసు మరింత లోతుగా సాగుతున్న దశలో, ఈ రెండు స్టేట్‌మెంట్లు కీలకంగా మారనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సాధారణ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో రేవంత్‌ రెడ్డి పోటీలో ఉన్న సమయంలో ట్యాపింగ్‌ జరిగినట్లు సిట్‌ బృందం గుర్తించింది. సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు ఆయన తమ్ముడు కొండల్‌ రెడ్డి, మేడ్చల్‌ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు సింగి రెడ్డి హరివర్ధన్‌ రెడ్డి ఫోన్స్‌ ట్యాప్‌ అయినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ నేత బిళ్ళ సుధీర్‌ రెడ్డి, మేడ్చల్‌ డీసీసీ అధ్యక్షుడు సింగిరెడ్డి హరివర్ధన్‌ రెడ్డి వాంగ్మూలం నమోదు చేసింది. గత బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు సహా జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్‌ చేశారు. ప్రధానంగా ప్రతిపక్ష నేతలు, సొంత పార్టీలోని అనుమానిత ఎమ్మెల్యేలు, వ్యాపార ప్రముఖులపై నిఘా పెట్టారు. స్థానిక బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు అందించే ఫోన్‌ నెంబర్స్‌ను మాజీ డీఎస్పీ ప్రణీత్‌ రావు ఆధ్వర్యంలోని ఎస్‌ఐబీ టీమ్‌ ట్యాపింగ్‌ చేసేది. సంబంధింత వ్యక్తుల వ్యక్తిగత, కుటుంబ, అనుచరుల వివరాలు, వ్యాపార లావాదేవీలను సేకరించేది. ఇలా ప్రభుత్వ పెద్దలు సూచించిన పొలిటికల్‌ లీడర్ల ఫోన్‌ నెంబర్స్‌తో పాటు వందల సంఖ్యలో ప్రైవేట్‌ వ్యక్తుల ఫోన్లను ట్యాపింగ్‌ చేశారు. ఇందులో ప్రణీత్‌రావుతో కలిసి పని చేసిన కానిస్టేబుల్‌ నుంచి అడిషనల్‌ ఎస్పీ స్థాయి అధికారి వరకు అక్రమాలకు పాల్పడినట్టు సిట్‌ దర్యాప్తులో వెల్లడైంది. ట్యాపింగ్‌ ద్వారా రికార్డ్‌ చేసిన ఆడియోలతో పలువురిని బ్లాక్‌మెయిల్‌ చేసినట్టు సిట్‌ ఆధారాలు సేకరించింది.
వరుసగా ఆరోసారి సిట్‌ విచారణకు ప్రభాకర్‌ రావు
తెలంగాణను కుదిపేసిన ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాష్ట్ర స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు సోమవారం ఆరోసారి సిట్‌ విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే ఐదుసార్లు విచారణకు లోనైన ఆయన, ఈసారి కూడా జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో పలువురు రాజకీయ నాయకులు, జర్నలిస్టుల ఫోన్‌లను ట్యాప్‌ చేసినట్లు ప్రస్తుత ప్రభుత్వం స్పష్టమైన ఆధారాలతో నిర్దారించింది. ఈ వ్యవహారంపై అధికారులు ప్రశ్నిస్తే ప్రభాకర్‌ రావు పూర్తిగా సహకరించట్లేదని సమాచారం. ఆయన నుంచి వచ్చే సమాచారంపై రాజకీయ పార్టీల నేతల ప్రమేయంపై స్పష్టత రావచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఐదు విచారణల్లో ప్రభాకర్‌ రావు సూటిగా సమాధానాలు ఇవ్వకుండానే తప్పించుకుంటున్నారని తెలుస్తోంది. మావోయిస్టులతో సంబంధాల పేరుతో వందల మంది రాజకీయ నాయకులు, పాత్రికేయుల ఫోన్‌లు ఒకేసారి ట్యాప్‌ చేయడం వెనుక ఉన్న కారణాలను ప్రశ్నించినప్పటికీ, ఆయన క్లారిటీ ఇవ్వలేదని సమాచారం. అందుకే ఈ వ్యవహారాన్ని సిట్‌ బృందం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశముంది. ఈ కేసులో ప్రస్తుతం మరికొంతమంది రాజకీయ నాయకుల స్టేట్‌మెంట్లను సిట్‌ అధికారులు ఇవాళ రికార్డ్‌ చేయనున్నారు. మొత్తంగా చూస్తే, తెలంగాణ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు ఇంకా అనేక మలుపులతో ముందుకు సాగుతోంది.

 

తాజావార్తలు