మారిన మొగల్‌ సరాయ్‌ జంక్షన్‌

ఇకనుంచి పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జంక్షన్‌గా మార్పు

లక్నో,జూన్‌5(జనం సాక్షి): ప్రఖ్యాత మొగల్‌ సురాయ్‌ రైల్వే స్టేషన్‌ పేరును మార్చారు. ఆ స్టేషన్‌ను ఇక నుంచి పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జంక్షన్‌గా పిలువనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను యూపీ ప్రభుత్వం విడుదల చేసింది. స్టేషన్‌ పేరు మార్చాలని గత ఏడాది ప్రవేశపెట్టిన తీర్మానానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్‌కు తెలియజేసింది. 1968లో ఇదే రైల్వే స్టేషన్‌లో పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ స్టేషన్‌లో ఉన్న ఓ ఫ్లాట్‌ఫామ్‌పై ఆయన మృతదేహాం లభ్యమైంది. స్టేషన్‌ పేరు మార్చాలన్న ప్రతిపాదనను సమాజ్‌వాదీ పార్టీ పార్లమెంట్‌లో వ్యతిరేకించింది. అయినా బీజేపీ మాత్రం ఆ పేరును మార్చేందుకు ముందుకు వెళ్లింది. 1800లో మొగల్‌ సురాయ్‌ స్టేషన్‌ను బ్రిటీషర్లు కట్టించారు. ఢిల్లీ నుంచి కోల్‌కతా మధ్యఉన్న రూట్లో ఈ స్టేషన్‌ కీలకమైంది. దేశంలోనే ఇది నాలుగవ బిజీ రైల్వే స్టేషన్‌గా పేరుగాంచింది. స్వాతంత్య్రానంతరం బొంబాయిలో ఉన్న ప్రఖ్యాత విటి జంక్షన్‌ను శివాజీ టెర్మినల్‌గా మార్చారు. మన నేతల పేర్లు పెట్టడం అమల్లోకి వస్తున్నాయి. ప్రధాని నివాసానికి ఉన్న మార్గాన్ని కూడా 7 రేస్‌ కోర్స్‌ రోడ్డును కళ్యాణ్‌ మార్గ్‌గా మార్చారు. తెలంగాణలో కూడా ఇలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి. వివిధ విశ్వవిద్యాలయాలకు తెలంగాణ ప్రముఖుల పేర్లు పెట్టారు.