మిర్చిరైతులు నష్టపోయినా పట్టించుకోరా

వారిని ఆదుకోవాలని అనిపించడం లేదా
గుంటూరులో మిర్చిరైతులకు మద్దతుగా బిజెపి మహాధార్నా
ప్రభుత్వం తీరుపై మండిపడ్డ సోము వీర్రాజు
గుంటూరు,మార్చి9(జనం సాక్షి): రాష్ట్రంలో మిర్చి రైతులు నష్టపోతే రాష్ట్ర ప్రభుత్వం నుండి కనీస స్పందన కరువైందని ఏపీ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మండిపడ్డారు. రైతులు ఆందోళనలను పట్టించుకోక పోవడం దారుణమన్నారు. చుట్టుగుంట సెంటర్‌ వద్ద బీజేపీ మహాధర్నా చేపట్టింది. తామర పురుగులతో నష్టపోయిన మిర్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. ఈ మహా ధర్నాకు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ జాతీయ నేత కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీలు జీవీఎల్‌, సిఎం రమేష్‌, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, పొగాకు బోర్డు చైర్మన్‌ యడ్లపాటి రఘునాథ్‌ బాబు, కేంద్ర కార్మిక సంక్షేమ బోర్డు ఛైర్మన్‌ వల్లూరి జయప్రకాశ్‌ నారాయణ, కిసాన్‌ మోర్చా అధ్యక్షుడు శశిభూషన్‌ రెడ్డి తదితరులు హాజరయ్యారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయశాఖ మంత్రి

తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ స్వయంగా ముఖ్యమంత్రే పంటల బీమా కోసం ఒక్క రూపాయి కట్టండి అని చెప్పారు. చివరికి రాష్ట్రం చెల్లించాల్సిన బీమా సొమ్ము చెల్లించలేదు. మిర్చిపై రైతులు నాలుగు వేల రూపాయల కోట్ల పెట్టుబడి పెట్టారని అన్నారు. వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు ప్రధాని మోదీ ఇచ్చిన వాటి గురించి చెప్పడని అన్నారు. సివిల్‌ సప్లయ్స్‌ ఛైర్మన్‌ గా ఉన్న ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి వెంటనే తొలగించాలన్నారు.ఈ ప్రభుత్వానికి పంటకాలువ గురించి తెలియదు. డైరెక్టర్‌ స్పెషల్‌ గురించి తెలుసు. ఐదురాష్టాల్ర ఎన్నికల ఫలితాలపై సోము వీర్రాజు స్పందించారు. యూపీలో యోగి ఆదిత్యనాథ్‌ తిరిగి సీఎం కాబోతున్నారు. ఆ విూటింగ్‌ ఈ విూటింగ్‌ లంటూ తిరుగుతున్న సీఎంల కుర్చీల కింద మంట వస్తుంది. అందరికీ చెమటలు పడతాయన్నారు సోము వీర్రాజు. బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు మాట్లాడుతూ.. ప్రభుత్వాన్ని నిద్రలేపటానికి ధర్నా చేపట్టాం. రైతు సమస్యల పరిష్కారం కోసమే ఇక్కడికొచ్చాం.గుంటూరు పౌరుషానికి చిహ్నంగా మిర్చి సాగవుతోంది. సైనికులు ఏవిధంగా దేశానికి సేవ చేస్తున్నారో అదే విధంగా మిర్చి రైతులు సేవ చేస్తున్నారు. యువజనులను, శ్రామికులను, రైతులను ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. వైఎస్పార్‌ కాంగ్రెస్‌ లో యువజనులు, శ్రామికులు, రైతులు లేరు. ఇక కాంగ్రెస్‌ మాత్రమే మిగిలింది. కాంగ్రెస్‌ కు పట్టిన గతే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పడుతుందని జీవీఎల్‌ విమర్శించారు