‘మీకోసం నేను పోరాడతా’

 
 న్యూఢిల్లీ : అకాల వర్షాలతో పంట నష్టపోయిన పంజాబ్ రైతులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పేందుకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం ఆ రాష్ట్రంలో పర్యటించారు. ‘పంజాబ్ ధాన్య భాండాగారం’గా పేరుపొందిన గోవింద్గఢ్, అంబాలా ప్రాంతాలతోపాటు ప్రసిద్ధ ఖన్నా మండీని సందర్శించిన ఆయన పంట నష్టంతో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాలను పరామర్శించారు. దేశానికి అన్నంపెట్టే రైతులను ఆదుకోకుండా, వారి భూమిని లాక్కునేందుకు భూసేకరణ సవరణ చట్టం తెస్తోందని కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రైతుల తరఫున ముందుండి పోరాడతానని స్పష్టం చేశారు. పంజాబ్ రైతుల దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తేవడమే తన పర్యటన ఉద్దేశమని రైతులకు వివరించారు.

ఢిల్లీ నుంచి పంజాబ్కు లోకల్ రైలులో రాహుల్ ప్రయాణించారు. దీంతో ఆ మార్గంలోని అన్ని స్టేషన్లలో సందడి నెలకొంది. ప్రయాణికుల్లో కొందరు రాహుల్ గాంధీ ఆటోగ్రాఫులు తీసుకొని, ఫొటోలు దిగారు. రైతు ఆత్మహత్యల అంశంపై మోదీ సర్కారుతో అమీతుమీ తేల్చుకోవాలని సిద్ధమైన రాహుల్ గాంధీ ఆ మేరకు తన భవిష్యత్ కార్యచరణను రూపొందించుకుంటున్నారు. ఇందులో భాగంగానే మే నెలలో విదర్భ నుంచి యాత్ర చేపట్టనున్నట్లు తెలిసింది. తెలంగాణ ప్రాంతంలోనూ రాహుల్ గాంధీ పర్యటిస్తారని టీపీసీసీ నేతలు పేర్కొన్నారు.