ముగిసిన యాత్ర.. బాబు ఇంటికి

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 28 (జనంసాక్షి) :
వస్తున్న మీకోసం పేరుతో గతేడాది అక్టోబర్‌ 2న చేపట్టిన చంద్రబాబునాయుడు పాదయాత్ర ముగిసింది. ఆదివారం విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో రాక్షసపాలన కొనసాగుతోం దని అన్నారు. ఆ పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించాల్సిన అవసరముందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ   కొందరు కుహనా రాజకీయ నాయకులు టిడిపికి తెలంగాణలో నూకలు చెల్లిపోయాయని విమర్శలు గుప్పిస్తున్నారని, వారికి ఈ ఘనస్వాగతం చెంప పెట్టులాంటిదవుతుందన్నారు. తెలంగాణ ముసుగులో రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేస్తున్న పార్టీలు, నేతలకు స్వాగతం ద్వారా గుణపాఠం కలుగకమానదన్నారు. అక్కడ నుంచి ఊరేగింపుగా బాబు తన స్వగృహానికి చేరుకున్నారు.