ముగిసిన సాగర్‌ టీకప్పు తుపాను

2

-గవర్నర్‌ సమక్షంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల చర్చలు

-రైతాంగాన్ని ఆదుకునేందుకు  ముఖ్యమంత్రుల నిర్ణయం

హైదరాబాద్‌,ఫిబ్రవరి14(జనంసాక్షి): ఆంధప్రదేశ్‌, తెలంగాణ రాష్టాల్ర మధ్య  ఉద్రిక్తతకు దారి తీసిన సాగర్‌ జల వివాదం తాత్కాలికంగా సమసింది. టీకప్పులో తుపాను చందంగా ముగిసింది.   ఘర్షణ వైఖరి వీడాలని నిర్ణయించారు. ఉన్న నీటిని పంటలను కాపాడడానికి, తాగునీటి అవసరాలకు వాడుకోవాలని నిర్ణయించారు.  ప్రస్తుత తరుణంలో ఎలాంటి వివాదాలకు పోకుండా ఇరు రాష్టాల్ర పంటలను కాపాడే లక్ష్యంతో సంయమనంతో ముందుకు పోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఉద్రిక్తతలకు తావు లేకుండా సాగర్‌ వద్ద భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు, కేవలం ఇరు రాష్టాల్ర ఇంజనీరింగ్‌ అధికారుల సమక్షంలో నీరు విడుదల చేసుకోవాలని అంగీకరించారు. శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ సమక్షంలో జరిగి ఇరు రాష్టాల్ర ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్‌ల సమావేశంలో ఈ మేరకు నిర్ణయానికి వచ్చారు. ఏపీ రైతుల అవసరాలు దృష్టిలో ఉంచుకుని మార్చి 31వరకు 10 టీఎంసీల నీటిని విడుదల చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకుంది. అంతేకాకుండా భవిష్యత్‌ నీటి అవసరాలపై చర్చించుకుని నిర్ణయం తీసుకోవాలని కూడా భేటీలో అంగీకారానికి వచ్చారు. దాదాపు గంటన్నర పాటు జరిగిన సమావేశంలో గవర్నర్‌ పలు సూచనలు చేశారు. 45 నిమిషాల పాటు సీఎంలతో గవర్నర్‌ విడివిడిగా చర్చలు జరిపారు. గతం జోలికి వెళ్లకుండా  ఇప్పటి అవసరాలకు అనుగుణంగా సమస్యలు పరిష్కరించుకోవాలని గవర్నర్‌ సలహా ఇచ్చారు. ఇకపై సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్చించుకోవాలని సీఎంలకు గవర్నర్‌ సూచించారు. తాజా పరిణామాల నేపథ్యంలో సాగర్‌ డ్యామ్‌కు సీఆర్‌పీఎఫ్‌ భద్రత కల్పించాలని నరసింహన్‌ను చంద్రబాబు కోరారు. అనంతరం ఇరు రాష్టాల్ర మంత్రులు, అధికారులు చర్చించి సిఎంలతో జరిగిన చర్చలకు అనుగుణంగా ప్రకట చేశారు. నాగార్జునసాగర్‌ నీటి వివాదంపై తెలంగాణ, ఏపీ రాష్టాల్ర మధ్య చర్చలు సఫలం కావడంతో ఇక అధికారుల సమక్షంలో నీటిని విడుదల చేసి పంటలకు అందించనున్నారు. మొత్తగా  గవర్నర్‌ సమక్షంలో నీటి పంపిణీ అవగాహన కుదిరింది. అనంతరం తెలంగాణ, ఏపీ నీటి పారుదల శాఖ మంత్రులు హరీష్‌రావు, దేవినేని ఉమ విూడియాతో మాట్లాడారు. ఇరు రాష్టాల్ల్రో పంటలు ఎండిపోకుండా నీరు విడుదలకు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఏ రాష్ట్ర రైతులకు అన్యాయం జరగకూడదని తెలిపారు. హైదరాబాద్‌ సహా ఐదు జిల్లాల్లో తాగునీటి అవసరాలపై అధికారులు రోజువారీ సవిూక్ష నిర్వహిస్తారని పేర్కొన్నారు. సాగర్‌ డ్యామ్‌పైకి ఏపీ, తెలంగాణ రాష్ట్ర పోలీసులు, కార్యకర్తలు వెళ్లకుండా ఉండాలని సూచించారు. కేవలం ఇరిగేషన్‌ అధికారులు మాత్రమే వెళ్లాలని తెలిపారు. ఏ ప్రాంతానికి ఎంత నీరు విడుదల చేయాలో ఇంజినీర్లు నిర్ణయిస్తారని చెప్పారు. శుక్రవారం తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనడంతో డ్యామ్‌ వద్ద ఇరు రాష్టాల్ర పోలీసులు లాఠీలు ఝలిపించుకునే వరకు వెళ్లింది. దీంతో నాగార్జునసాగర్‌ నీటి వివాదం రాజ్‌భవన్‌కు చేరుకుంది. గవర్నర్‌ నరసింహన్‌ సమక్షంలో తెలంగాణ, ఏపీ రాష్టాల్ర సీఎంలు కేసీఆర్‌, చంద్రబాబు సాగర్‌ నీటి వివాదంపై చర్చించారు. సుమారు గంట పాటు సమావేశం కొనసాగింది. సమస్యలు లేకుండా నీటి విడుదలపై చర్చించుకోండని ఇరు రాష్టాల్ర సీఎంలకు గవర్నర్‌ సూచించగా అంగీకరించి నిర్నయం తీసుకున్నారు. ప్రస్తుతానికి 10 టీఎంసీల నీటిని ఇస్తామని ఏపీకి తెలంగాణ ప్రతిపాదన చేసింది. ఖరీఫ్‌లో 10 టీఎంసీల నీటిని ఏపీ సర్దుబాటు చేయాలని తెలంగాణ చెప్పింది. తొలుత గవర్నర్‌ నరసింహన్‌ ఇద్దరు సీఎంలతో విడివిడిగా సమావేశమై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత సంయుక్తంగా సమావేశమై సాగర్‌ నీటి విడుదలపై చర్చించారు. సమావేశం అనంతరం ఇద్దరు సీఎంలూ రాజ్‌భవన్‌ నుంచి వెళ్లిపోయారు. ఏపీ సీఎంతో పాటు ఆరాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, అధికారులు, తెలంగాణ సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, ఈటెల రాజేందర్‌, ఇరు రాష్టాల్ర  డీజీపీలు హాజరయ్యారు.

డిజిపిలకు గవర్నర్‌ క్లాస్‌..?

నాగార్జునసాగర్‌ డ్యామ్‌ వద్ద శుక్రవారం ఇరు రాష్టాల్ర పోలీసులు ఘర్షణకు దిగడంపై గవర్నర్‌ నరసింహన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై రెండు రాష్టాల్ర డీజీపీలు జేవీరాముడు, అనురాగ్‌శర్మలను పిలిపించారు. సాక్షత్తు పోలీసులు కొట్టుకుంటుంటే విూరేం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు గొడవ కంటే ఇదే వివాదం అయిందని మండిపడ్డారు. పోలీసుల వైఫల్యంతోనే సాగర్‌ ఘటన చోటుచేసుకుందన్నారు. దీంతో నరసింహిన్‌కు రెండు రాష్టాల్ర డీజీపీలు వివరణ ఇచ్చే యత్నం చేశారు. సాగర్‌లో తాజా పరిస్థితిని వివరించారు.

పంటలు కాపాడాలని నిర్ణయించాం

రాజ్‌భవన్‌లో ఇరు సీఎంల సమావేశం అనంతరం ఏపీ మంత్రి దేవినేని ఉమాతో కలిసి తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విూడియాతో మాట్లాడారు. రాజకీయ నాయకులు, పోలీసులు డ్యాం విూదకు వెళ్లకూడదని నిర్ణయించినట్లు తెలిపారు. ఇరు రాష్టాల్ర ఇంజినీర్లు మాత్రమే డ్యాంను పరిశీలించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఇరు చోట్ల పంటలు ఎండిపోకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలని నిర్ణయించుకున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. వచ్చే ఖరీఫ్‌ నుంచి కేంద్ర ప్రభుత్వ అధికారుల సాయంతో నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవాలని భావించినట్లు చెప్పారు. రెండు రాష్టాల్ర అధికారులు కూర్చుని సాగునీటి కోసం అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకోవాలని అభిప్రాయానికి వచ్చినట్లు పేర్కొన్నారు. నీటి వినియోగం విషయంలో రెండు రాష్టాల్ర మంత్రులం ఎప్పటికప్పుడు చర్చించుకుంటామని ఏపీ భారీ నీటిపారుదలశాఖ మంత్రి దేవినేని ఉమా తెలిపారు. తెలంగాణ, ఆంధప్రదేశ్‌లో పంటలు నష్టపోకుండా ఉండేందుకు తక్షణం నీరు విడుదల చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. పోలీసులు, రాజకీయనాయకులు డ్యాం పైకి వెళ్లకూడదని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. ఇరిగేషన్‌ అధికారులు సమావేశమై ప్రస్తుతం ఉన్న నీటిలో ఏ రాష్టాన్రికి ఎంత నీరు అవసరమో చర్చించి నిర్ణయిస్తారని పేర్కొన్నారు.