మ్యాక్స్‌వెల్‌కు బీసీసీఐ భారీ జరిమానా

చెన్నై సూపర్‌ కింగ్స్ (సీఎస్‌కే)తో జరిగిన మ్యాచ్‌లో ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్‌) ఆల్ రౌండర్ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌కు బీసీసీఐ భారీ జరిమానా విధించింది. మ్యాక్స్‌వెల్‌ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు అత‌ని ఖాతాలో ఓ డీమెరిట్‌ పాయింట్ కూడా చేరింది.

ఈ స్పిన్ ఆల్‌రౌండ‌ర్‌ ఐపీఎల్‌ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్‌ 2.2లోని లెవల్‌ 1 తప్పిదానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి మ్యాచ్‌ రిఫరీ తీసుకున్న నిర్ణయానికి మ్యాక్స్‌వెల్‌ సైతం అంగీకరించాడని, దాంతో మ్యాచ్‌ఫీజులో 25శాతం కోత విధిస్తున్నట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

ఐపీఎల్ ప్ర‌వ‌ర్త‌న నియ‌మావ‌ళి ప్ర‌కారం ఆర్టిక‌ల్ 2.2లో క్రికెట‌ర్ ప‌రికరాలు, బట్టలు, గ్రౌండ్ ఎక్విప్మెంట్ ఇత‌ర వ‌స్తువుల‌ను అగౌర‌వ ప‌ర‌చ‌డం నేరం. అందుకు త‌గినశిక్ష ఉంటుంది. అలాగే ఇదే అర్టిక‌ల్ కింద వికెట్ల‌ను త‌న్న‌డం, లేదా నిర్ల‌క్ష్య పూరితంగా ప్ర‌వ‌ర్తించ‌డం, అలాగే అడ్వ‌ర్టైజింగ్ బోర్డులు, బౌండ‌రీ ఫెన్సులు, డ్రెస్సింగ్ రూం డోర్లు, అద్దాలు, కిటికీలు, ఇత‌ర వ‌స్తువులపై ప్ర‌తాపం చూపించ‌డం నిషిద్దం. మ్యాక్స్‌వెల్‌ తాజాగా ఇలాంటి ప‌నికి పాల్ప‌డినందుకుగాను ఐపీఎల్ యాజ‌మాన్యం శిక్ష విధించిన‌ట్లు తెలుస్తోంది.

సీఎస్‌కేతో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్‌ బ్యాటింగ్‌లో విఫ‌ల‌మైన విష‌యం తెలిసిందే. కేవలం ఒక పరుగు చేసిన పెవిలియన్‌కు చేశాడు. సీఎస్‌కే స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. కాగా, ఉత్కంఠ‌భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ జట్టు 18 పరుగుల తేడాతో విజయం సాధించింది.

టాస్ గెలిచి మొద‌ట‌ బ్యాటింగ్ చేసిన పీబీకేఎస్‌ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల‌కు 219 ప‌రుగుల భారీ స్కోర్‌ చేసింది. పంజాబ్ యువ ఓపెన‌ర్ ప్రియాంశ్ ఆర్య ఐపీఎల్ సెకండ్ ఫాస్టెస్ట్ సెంచ‌రీ (39 బంతుల్లో శ‌త‌కం) చేసిన ఇండియ‌న్ గా నిలిచాడు. అనంత‌రం ఛేద‌న‌లో మొత్తం ఓవ‌ర్లన్నీ ఆడిన చెన్నై 5 వికెట్ల‌కు 201 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. దీంతో పంజాబ్ 18 ర‌న్స్ తేడాతో గెలుపొందింది.