‘యూనియన్’ ల సంధికాలం ఇది!

‘యూనియన్’ ల సంధికాలం ఇది!

దేశం లోని బొగ్గు సంస్థల్లో సంధి కాలం కొనసాగుతున్నది. యాజమాన్యం తో రాజీ పడిపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తున్నది.ప్రస్తుతం అంతా కాంప్ర మైజ్ ల కాలం కొనసాగుతున్నది.ప్రభుత్వ రంగ సంస్థలు అయిన కోల్ ఇండియా, ఇటు సింగరేణి లో ఇదే పరిస్థితి ఉంది. పారిశ్రామిక సంబధాలు బలోపేతం పేరిట ఏమి జరుగుతుంది, ఇక్కడ తాకట్టు ఎవరిని? ఎవరు పెడుతున్నారు? ఆత్మ విమర్శ అవసరం!అటు జాతీయ స్థాయిలో జీతాల పెరుగుదల అమలు మీద అడ్డం తగిలిన కేంద్రం విధానాల మీద ఐదు జాతీయ కార్మిక సంఘాలు ఇచ్చిన మూడు రోజుల జాతీయ సమ్మె ను వాయిదా వేసుకున్నాయి.అక్టోబర్ 5 నుంచి 7 వరకు ఈ సమ్మె పిలుపు ఇవ్వగా కోల్ ఇండియా స్థాయిలో సీఎండీ తో జరిగిన చర్చలు కారణంగా వాయిదా వేసుకున్నారు. మరో వైపు సింగరేణి లో యూనియన్ ఎన్నికలు వాయిదా కు మొత్తం 15 కార్మిక సంఘాల్లో ని 13 సంఘాలు లేఖ ఇచ్చాయి. ఏఐటీయూసీ, బిఎమ్మెఎస్ లు ఎన్నికలకు అనుకూలంగా ఉన్నాయి. ముందు నిర్ణయించిన మేరకు, హై కోర్ట్ ఆదేశం వలన అక్టోబర్ 28 న ఎన్నికలు జరుపడానికి డిప్యూటీ సిఎల్సి శ్రీనివాసులు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఇక్కడ కాంప్రమైజ్ చోటు చేసుకోవడం విశేషం!13 సంఘాలు రాజీ పడినాయి, అనే ఆరోపణల మీద ఆ సంఘాలు ఒక ప్రకటన విడుదల చేసాయి. ఆ ప్రకటన ఇలా ఉంది.
సింగరేణి సంస్థలో 1998 నుండి కార్మిక సంఘాల గుర్తింపు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలు నిర్వహించటం కార్మికుల ప్రజాస్వామిక హక్కుని కార్మిక సంఘాలన్నీ భావించా యి.గుర్తింపు ఎన్నికలు సింగరేణిలో జరపడానికి మేము వ్యతిరేకంకాదు.చట్ట వ్యతి రేకమైన అప్రజాస్వామీక మైన కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ను సవ రించాలని,చట్టబద్ధ కార్మిక సంఘాల హక్కులైన సభ్యత చేర్పింపు,సమావేశాల నిర్వహణ,గేట్ మీటింగు లు,అధికారులతో చర్చలకు తగిన ప్రాధాన్యతతో కూడిన కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఉండాలని సింగరేణిలో కార్మిక సంఘాలన్ని డిమాండ్ చేస్తున్నాయి.కానీ ప్రస్తుత కోడ్ ఆఫ్ డిసిప్లిన్ సింగరేణిలో అన్ని కార్మిక సంఘాల చట్టబద్ధ హక్కులను నిర్మూలించి సంఘాలకు మను గడ లేకుండా చేసేందుకు గెలిచిన ఒకటి రెండు సంఘాలకు మాత్రమే సర్వాధికారాలు కల్పించేందుకు కోడ్ ఆఫ్ డిసిప్లి న్ రూపొందించ బడిoది.వివిధ ఎన్నిక ల సందర్భాల్లో ప్రమాద కరమైన కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ను మార్చాలని కార్మిక సంఘాలన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తూ వచ్చాయి.కనుక ఈ ఎన్నికలకు ముందే కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ను మార్చాల్సిన అవసరం ఉందని కార్మిక సంఘాలు స్పష్టం చేస్తున్నాయి.
1998లో రెండు సంవత్సరాలు కాల పరిమితితో సింగరేణిలో ప్రారంభమైన గుర్తింపు సంఘాల ఎన్నికలు తదుపరి నాలుగేళ్లకు పొడిగించబడ్డాయి.ఇది ఓటేసిన కార్మికులకు అభిప్రాయాలకు భిన్నమైనది.మెజారిటీ కార్మిక సంఘాల అభిప్రాయాలకు వ్యతిరేకమైనది.యాజమాన్యం తమ అవసరాల కొరకు ఒకటి రెండు సంఘాలను చెప్పుచేతు ల్లో పెట్టుకొని మొత్తం కార్మికుల హక్కులను హరీoచి వేసేందుకు నాలుగు సంవత్సరాల కాల పరి మితిని చేశారు.కనుక రెండు సంవత్సరాల కాలం పరిమితితో కూడిన ఎన్నికల నిర్వహించా లని ఈ ఎన్నికల సందర్భంగా డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ ఏర్పాటు చేసిన సమావేశాల న్నీటిలో అన్నికార్మిక సంఘాలు తెలియజేయడం జరిగింది.
రెండు సంవత్సరాల కాల పరిమితిని ఫైనల్ చేసి గుర్తింపు ఎన్నికలు నిర్వహించాలని, చట్టాన్ని కార్మిక హక్కులను గౌరవించేలా కోడ్ ఆఫ్ డిసిప్లేన్ సవరించాలని,కాంట్రాక్టు కార్మికులకు ఓటు హక్కును కల్పించాలని ఈ అంశాలను ఎన్నికలకు ముందే ఫైనల్ చేసి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయాలని సింగరేణిలో 12 కార్మిక సంఘాలు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఎన్నికల పిరియడ్ ముగిసి నందున అన్ని కార్మిక సంఘాల కు సింగరేణి యాజమాన్యం సమాన గుర్తింపును ఇవ్వాలని అన్నికార్మిక సంఘాలు చేసిన వత్తిడి మేరకు 15 కార్మిక సంఘాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించేలా యాజమాన్యం సర్క్యులర్ విడుదల చేసిందని దీనిని సింగరేణి అన్ని ఏరియాల లో అన్ని అధికార కార్యక్రమాలలో అమలుచేస్తూ అన్ని సంఘాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు.బొగ్గు సంస్థల్లో ప్రస్తుత పరిస్థితి ఆందోళన కరం గా ఉంది. ఆందోళనలు బలహీనం కారణంగా బొగ్గు బ్లాక్ ల అమ్మకం ను, కోల్ ఇండియా లో నుంచి పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతూనే ఉంది. అవుట్ సోర్సింగ్ విచ్చలవిడిగా పెరిగింది. కాంట్రాక్ట్ సిస్టం విచ్చల విడి అయ్యింది. కాంట్ర్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు, సౌకర్యాలు లేవు.కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ లోనూ అధికారులకు, ఒక రూలు, కార్మికులకు ఒక రూలు అమలు అవుతున్నది! యూనియన్ లు, నేతలు ప్రోటోకాల్ యావలో పడి పోయారు!ప్రోటోకాల్ మత్తు లో కొందరు నేతల మస్త్ సంపాదన అనే వాదన కూడ కార్మికుల్లో ఉంది అంటే అతిషయోక్తి కాదు!మెడికల్ ఇన్వ్యాలిడేషన్స్ లో నేతల భారీ లక్షల్లో వసూళ్లు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. (ఎవరికి వర్తిస్తే వారికే )ఎంత కాలం ఈ పరిస్థితి, ఎందుకు?ఇంకా ఈ జీవచ్చవాల మీద పైసలు ఏరుకునుడు ఎందాక?ఇకనైనా మానండి!ఈ నెల మూడున, అంటే మంగళవారం కార్మికుల జీతాల మీద ఏర్పడిన ప్రతిష్టంబన కు నిరసనగా సీఐటీయూ నల్ల బ్యాడ్జిల నిరసన కార్యక్రమం చేపట్టింది. డిపిఈ గైడ్ లైన్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు!సింగరేణి లో అటు కోల్ ఇండియా లో గందరగోళం గా ప్రస్తుతం పరిస్థితి ఉంది. జీతాల మీద సమ్మె తప్పే పరిస్థితి కనిపించడం లేదు!అయితే ఇందుకు ఆలస్యం ఏమాత్రం మంచిది కాదు!
…………………………………………………. ఎండి. మునీర్,సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకులు,9951865223,