యూపిలో మరో దారుణ అత్యాచార ఘటన

భార్య కళ్లముందే బాలికపై భర్త అత్యాచారం
నిందితులైన దంపతులపై పోలీసుల కేసు
లక్నో,ఆగస్ట్‌17(జనంసాక్షి): ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో మరో దారుణం తాజాగా వెలుగుచూసింది. ఓ కామాంధుడైన భర్త తన భార్య ముందే 16 ఏళ్ల దళిత బాలికపై అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని పశ్చిమ సరిరా పోలీసుస్టేషను పరిధిలోని ఓ గ్రామంలో జరిగింది. అయితే భార్య ప్రేరేపణతోనే ఇదంతా జరిగిందని గుర్తించారు. తన కుమార్తెను నిందితుడి భార్య తీసుకువెళ్లి తన భర్తకు అప్పజెప్పి అత్యాచారం చేయించిందని బాధిత బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధిత బాలిక తల్లి కోర్టును ఆశ్రయించింది. నిందితుడు తన భార్య ముందు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కుటుంబ సభ్యులను బెదిరించాడని పోలీసులు తెలిపారు.కోర్టు ఆదేశంతో నిందితులైన దంపతులపై కేసు నమోదు చేశామని, బాలికను వైద్య పరీక్షల కోసం పంపించామని సీనియర్‌ పోలీసు అధికారి సర్వేష్‌ సింగ్‌ చెప్పారు.ఈ కేసుపై విచారణ జరుపుతున్నామని, నిందితులైన దంపతులను అరెస్టు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని సింగ్‌ తెలిపారు.