రక్తదానం సామాజిక బాధ్యత.

ఆరోగ్యవంతులందరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలి.
అదనపు కలెక్టర్ మను చౌదరి.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, జులై 28(జనంసాక్షి):

రక్తదానం ఒక సామాజిక బాధ్యతని, ఆరోగ్యవంతులందరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని అదనపు కలెక్టర్‌ మను చౌదరి పిలుపునిచ్చారు.నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో తగిన స్థాయిలో రక్త నిల్వలు ఉండేలా గురువారం జిల్లా కలెక్టరేట్ సముదాయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని అదనపు కలెక్టర్‌ మను చౌదరి ప్రారంభించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లోని బ్లడ్‌ బ్యాంకు సామర్ధ్యం,అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రతి నెల రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామ న్నారు.జిల్లాస్థాయి నుంచి క్షేత్రస్థాయి వరకు పనిచేస్తున్న ఉద్యోగులు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని అదనపు కలెక్టర్‌ పిలుపునిచ్చారు. గురువారం నాటి శిబిరంలో చాలా మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి రక్తదానం చేసినట్లు తెలిపారు.రక్తదానం చేయటానికి 100 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, మిగతా వారు జిల్లా ఆసుపత్రిలో రక్తదానం చేయటానికి ముందుకు వచ్చారన్నారు. రక్తదానం చేయటంతో ఆరోగ్య సమస్యలు వస్తాయన్నది కేవలం అపోహ మాత్రమేనని తెలిపారు.రక్తదానం చేసేలా ప్రజలలో చైతన్య కల్పించటానికి తొలుత ప్రభుత్వ ఉద్యోగులు ఈ శిబిరంలో స్వచ్ఛంద రక్తదానం చేస్తున్నట్లు తెలిపారు.
శస్త్రచికిత్సలు, ఇతర వ్యాధులతో బాధపడే వారికి అవసరమైన రక్తం అందుబాటులో ఉండేలా స్వచ్ఛందంగా రక్తదానం చేయటంతో వారి ప్రాణాలను కాపాడవచ్చన్నారు.రక్తదానం ఆవశ్యకత, ప్రాముఖ్యతను తెలియజేసారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి అనిల్ ప్రకాష్,కలెక్టరేట్ లోని డిఆర్డిఏ,రెవిన్యూ,డిపిఆర్ఓ, వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు ఈ సందర్భంగా రక్తదానం చేశారు.ఈ రక్తదాన శిబిర కార్యక్రమంలో డాక్టర్ రోహిత్, డాక్టర్ రమేష్ చంద్ర, జిల్లా ఆడిట్ అధికారి శ్రీనివాస్ బాబు, డిపిఆర్ఓ సీతారాం, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు