రహదారుల అధ్వాన్న పరిస్థితిపై జనసేన ఆందోళన

గుంటూరు,జూలై16(జనం సాక్షి ): రాష్ట్రంలో రహదారుల అధ్వాన్న పరిస్థితిపై జనసేన ఆందోళన చేపట్టింది. జిల్లాలోని ఏ.టి.అగ్రహారంలో పాడైపోయిన రహదారిపై జనసేన శ్రేణులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ… రాష్ట్రంలో రహదారులపై జనం వెళ్లే పరిస్థితి లేదన్నారు. రహదారుల దుస్థితి ఫొటోలు ముఖ్యమంత్రికి పంపిస్తున్నామని, రహదారుల మరమ్మత్తులకు సీఎం చెప్పిన గడువు పూర్తయిందని అన్నారు. ఈనెల 20న రహదారులపై ఎగ్జిబిషన్‌ పెడతామని సీఎం అన్నారని, ఆ ప్రదర్శనలో తాము పంపించే ఫొటోలు ప్రదర్శించాలని తెలిపారు. ప్రజాప్రతినిధులు గడపగడపకు తిరగటం మాని రోడ్లపై నడవాలని సూచించారు. కనీసం ఈ ఫొటోలు చూసైనా ముఖ్యమంత్రి స్పందించాలని పేర్కొన్నారు.