రాజన్‌ ప్రపంచంలో గొప్ప ఆర్థిక వేత్త

2

– చిదంబరం కితాబు

ఢిల్లీ,మే28(జనంసాక్షి): రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌పై బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి నిప్పులు చెరుగుతుండటం, ఆయనను తొలగించాలంటూ ప్రధాని మోదీకి రెండు లేఖలు రాయడం వంటి పరిణామాల నేపథ్యంలో రాజన్‌కు కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చదంబరం బాసటగా నిలిచారు. ప్రపంచంలోని గొప్ప ఆర్థికవేత్తలలో రాజన్‌ ఒకరని ప్రశంసించారు. ఎన్డీఏ రెండేళ్ల పాలనలో ఎదురైన పరాజయాలను ఆయన విూడియాతో శనివారం ముచ్చటించారు. ఈ క్రమంలో రాజన్‌కు రెండోసారి ఆర్బీఐ గవర్నర్‌ పదవి ఇవ్వాలనుకుంటున్నారా అని విూడియా అడిగినప్పుడు, ఆ పదవికి ఆయన అర్హుడేననంటూ తేల్చిచెప్పారు. మోడీ ప్రభుత్వం కూడా ఆ పదవికి ఆయన అర్హుడేనని గుర్తిస్తుందని తాను భావిస్తున్నానని అన్నారు. రాజన్‌ను పదవి నుంచి తప్పించాలని స్వామి చేస్తున్న డిమాండ్‌పై స్పందించేందుకు చిదంబరం నిరాకరించారు. అదే మోదీ, జైట్లీలు రాజన్‌ను వ్యతిరేకంగా మాట్లాడి ఉండే తాను స్పందించేవాడినని అన్నారు. యూపీఏ హయాంలో రాజన్‌ను ఆర్బీఐ గవర్నర్‌గా నియమించారు. ఆయన పదవీకాలం సెప్టెంబర్‌లో ముగియనుంది.