రాష్ట్రాన్ని దోచుకు తింటున్న కల్వకుంట్ల కుటుంబం.

-ముఖ్యమంత్రికి పాలించే అర్హత లేదు.
-బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 3 (జనంసాక్షి):
పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పంచభూతాలను సైతం దోచుకుని పాలన చేస్తున్నారని, ఇచ్చిన హామీలను నెరవేర్చలేని ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క నిమిషం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాని రుద్రమ ధ్వజమెత్తారు శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రజాగోష బిజెపి భరోసా యాత్ర కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సుదీర్ఘ కాలం పాటు రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసి 1200 మంది అమరులు త్యాగం అయిన తర్వాత రాష్ట్రాన్ని సాధించుకుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గద్దెనెక్కి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని మండిపడ్డారు. పాలమూరు జిల్లాలో వలసలు కొనసాగు తున్నాయని ఒక్క నారాయణపేట ప్రాంతం నుండే ప్రతినిత్యం ముంబైకి బస్సులు వెళుతూ ఉంటాయని అన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో పూర్తి స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేయలేదని ఇచ్చిన రెండు పడకల ఇండ్ల నిర్మాణం వ్యవసాయ భూ పంపిణీ అమలు చేయకపోవడం వల్ల ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నా రన్నారు. శ్రీకాంత్ ఆచారి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలను త్యాగం చేస్తే కేసీఆర్ కుటుంబం మాత్రం రాజ భోగాల అనుభవిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ స్థలాలు అధికార పార్టీ నేతలు కబ్జాలు చేస్తూ దళితులకు గతంలో ప్రభుత్వాలు ఇచ్చిన భూములను ప్రభుత్వ కార్యాలయాలకు వినియోగించు కుంటున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రతిష్ట కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కొని పరువు తీశారని మండిపడ్డారు. ప్రజలకు భరోసా కల్పించేందుకే యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దిలీప్ చారి, సుబ్బారెడ్డి,పార్లమెంట్ మాజీ కన్వీనర్ బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పోల్ దాసు రాము, అసెంబ్లీ నాయకులు కొండా నగేష్, మున్సిపాలిటీ అధ్యక్షులు ఎలిమే రాము తదితరులు పాల్గొన్నారు.