రెవెన్యూ డివిజన్గా చెన్నూరు
హామీనిచ్చి నెరవేర్చిన సీఎం కేసీఆర్
ఎమ్మెల్యే, విప్ బాల్క సుమన్ హర్షం
హైదరాబాద్ (జనంసాక్షి) : మంచిర్యాల జిల్లాలోని చెన్నూరు ప్రజల చిరకాల వాంఛ నేరవెరబోతున్నది. రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ చెన్నూరు పట్టణాన్ని రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తామని హామీనిచ్చారు. మంచిర్యాల పర్యటనలోనూ మంత్రి కేటీఆర్ చెన్నూరును రెవెన్యూ డివిజన్ చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చెన్నూరు డివిజన్ పరిధిలోకి చెన్నూరు, జైపూర్, భీమారం, కొత్తపల్లి, మందమర్రి, అస్నాద్, పారుపల్లి మండలాలతో డివిజన్ ఏర్పాటుకు ప్రతిపాదించింది. దీంతోపాటు ప్రస్తుతం చెన్నూరు మండలంలో ఉన్న అస్నాద్ను కొత్త మండల కేంద్రంగా, 11 గ్రామాలతో మండలాన్ని, కొత్తపల్లి మండలంలో కొనసాగుతున్న పారుపల్లి కేంద్రంగా 19 గ్రామాలతో కొత్త మండలాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సర్కారు నిర్ణయంపై విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.