రేపు విద్యుత్‌ ఉద్యోగుల డిస్కం ముట్టడి

సైదాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్తు ఉద్యోగుల సంఘం ఏపీఈఈయూ-1104 ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని ఏపీసీపీడీసీఎల్‌ డిస్కం కార్యాలయం ముట్టడి కార్యక్రమం నిర్వహించనున్నారు. సైదాబాద్‌లోని ఆస్మాన్‌ఘడ్‌ విద్యుత్తు డివిజనల్‌ సిటీ-8 కార్యాలయంలో శుక్రవారం విద్యుత్తు ఉద్యోగుల సంఘం సమావేశం జరిగింది. ఆస్మాన్‌ఘడ్‌ డివిజన్‌ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు ఎం.బుచ్చయ్య, రామకృష్ణానంద్‌, సమావేశాన్నుద్దేశించి మాట్లాడారు. డిసెంబర్‌ 1న మింట్‌కాంపౌండ్‌లో నిరవధిక నిరాహర దీక్ష చేయనున్నట్లు వివరించారు. డిసెంబర్‌ 3న చలో విద్యుత్తు సౌధ కార్యక్రమాన్ని యూనియన్‌ తలపెట్టిందని పేర్కొన్నారు. దశల వారీ ఆందోళనలతో యాజమాన్యం స్పందించని పక్షంలో 5 నుంచి సమ్మె చేసేందుకు యూనియన్‌ సిద్ధంగా ఉందని వివరించారు.