రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే దుర్మరణం

బెంగళూరు, మే28(జ‌నం సాక్షి ) : మంత్రివర్గ విస్తరణ హడావిడిలో ఉన్న కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీకి ఊహించని విషాదం ఎదురైంది. సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ పార్టీ సీనియర్‌ నాయకుడు, జంఖండి ఎమ్మెల్యే సిద్దు భీమప్ప న్యామగౌడ్‌ దుర్మరణం చెందారు. గోవా నుంచి బాగల్‌కోట్‌కు రోడ్డు మార్గం గుండా వస్తోన్న ఎమ్మెల్యే కారును తులసిగిరి వద్ద ఓ లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ భీమప్పను ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాయి. జంఖండి నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి గెలుపొందిన భీమప్పకు ఈ సారి మంత్రి పదవి దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతోన్నవేళ ఆయన మరణవార్త అభిమానులను, కుటుంబసభ్యులను దిగ్భాంత్రికి గురిచేసింది. ఎమ్మెల్యే మృతి పట్ల ముఖ్యమంత్రి కుమారస్వామి, డిప్యూటీ సీఎం పరమేశ్వర సంతాపం తెలిపారు. సోమవారం సాయంత్రమే గౌడ అంత్యక్రియలు జరుగుతాయని తెలిసింది. న్యామగౌడకు భార్య, ఇద్దరు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. 1990-91 మధ్య పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ఆయన కేంద్ర మంత్రిగా సేవలు అందించారు. న్యామగౌడ మృతి పట్ల వివిధ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు.
————————————–