వన సంరక్షణే మన సంరక్షణ

మొక్కలు నాటుదాం – పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం
8వ విడత హరితహారం కార్యక్రమంలో
జిల్లా ఏస్పీ. జె. రంజన్ రతన్ కుమార్

జోగులాంబ గద్వాల బ్యూరో (జనంసాక్షి ) జూలై 28 : మానవ జాతి మనుగడకు మొక్కలే జీవనాధారం అని, భవిష్యత్ తరాల వారికి స్వచ్ఛమైన గాలిని అందించడం మన బాధ్యత అని, వన సంరక్షణే మన సంరక్షణ కావున అందుకు ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలు నాటాలని జిల్లా ఎస్పీ జె. రంజన్ రతన్ కుమార్ పిలుపునిచ్చారు.
8వ విడత హరితహారంలో భాగంగా ప్రపంచ ప్రకృతి దినోత్సవంను పురస్కరించుకొని గురువారం జిల్లా కేంద్రంలోని పిజెపి క్యాంపులో ఉన్న నూతన జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణoలో జిల్లా ఎస్పీ జిల్లా అదనపు ఎస్పీ బి. రాములు నాయక్ తో, గద్వాల డి.ఏస్పీ ఎన్. సి హెచ్ రంగస్వామి తో, ఏ.ఆర్ .డి.ఏస్పీ ఇమ్మనియోల్ తో కార్యాలయ , ఏ.ఓ సతీష్ తో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా ఈ హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగా 8 విడత హరితహారం కార్యక్రమాన్ని ఈ రోజు నూతన జిల్లా పోలీస్ కార్యాలయాల సముదాయ అవరణం లో నిర్వహించడం జరిగిందని అన్నారు . రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి హరితహారం పై ప్రత్యేక దృష్టి పెట్టారని, ఎక్కడైతే పచ్చదనం ఉంటుందో అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని ,ఫలితంగా అక్కడ ఉండే వారి యొక్క ఆలోచన విధానం కూడా మారుతుందని అన్నారు. ప్రకృతి మనకు ఎంతో ముఖ్యమైనదని, ప్రకృతి తరువాతనే జీవకోటి భూమి పైకి వచ్చిందన్న విషయం చరిత్ర చెప్పిన సత్యం అని అన్నారు. భూ మండలం పై పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించేందుకు, ప్రాణ వాయువు అయిన ఆక్సిజన్ శాతాన్ని పెంచేందుకు, వర్షాలు పడేందుకు, విపత్తుల సమయం లో చెట్లు ఎంతగానో ఉపయోగపడతాయని , భూమి మీద పశుపక్షాదుల నివాసం చెట్లే నని , మానవ జీవన విధానం లో చెట్ల పాత్ర ఎంతో ముడిపడి ఉందని అన్నారు. యూరప్ ప్రాంత దేశాలలో ఉష్ణోగ్రతలు ట్రాఫిక్ సిగ్నల్స్ కరిగిపోయే స్థాయి కి పెరిగి తీవ్ర సమస్యలు తలెత్తడానికి కారణం పర్యావరణం సమతుల్యం లేకపోవడమే నని అన్నారు. అప్పట్లో మనం చూసిన అడవులు ఇప్పట్లో లేవనే విషయం మనకందరికీ తెలుసునని, రాను రాను జంతువులు అంతరించిపోతున్నాయని , మానవుడు ఎంత ఎదిగిన ప్రకృతిని నిర్లక్ష్యం చేయకూడదని అన్నారు.
రాబోయే తరాల ఆరోగ్యకరమైన భవిష్యత్ ను గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టిలో ఉంచుకొని హరిత హారం కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తూ హరితహారం లో తెలంగాణ రాష్ట్రం ను దేశంలోనే మొదటి స్థానం లో నిలిపారని కొనియాడారు.మన చుట్టూ ఉన్న పరిసరాలు ఎంత పరిరక్షించుకుంటే మనం అంత ఆరోగ్యం గా ఉంటామని అన్నారు.
8 వ విడత హరిత హారంలో భాగంగా జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో అన్ని పోలీస్ స్టేషన్ ల అవరణలలో,పోలీస్ శాఖ కు సంబందించిన ఇతర భూమిలో విరివిగా మొక్కలు నాటడం జరుగుతుందని అన్నారు.ప్రతి ఒక్కరూ కనీసం10 మొక్కలు చొప్పున నాటాలని కార్యాలయ సిబ్బందికి సూచించారు.
ప్రతి ఒక్కరు మొక్కలను నాటడం బాధ్యతగా భావించాలని, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన గాలిని అందించాలన్న, వారికి మంచి ఆరోగ్యo ను అందించాలన్న ఇప్పటి తరం వారు విరివిగా మొక్కలు నాటడం తప్పనిసరి అని, మానవ జాతి మనుగడకు మొక్కలే జీవనాధారం అని అన్నారు. చివరగా పర్యావరణ పరిరక్షణకు కు తాము అంత బాధ్యత తీసుకుంటామని అధికారులతో, సిబ్బంది తో ప్రతిజ్ఞ చేయించారు.

గ్రీన్ ఛాలెంజ్ విసిరిన జిల్లా ఎస్పీ

గౌరవ ఎంపీ సంతోష్ కొనసాగిస్తున్న గ్రీన్ ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని రెండు రోజుల క్రితం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ శ్రీ సురేందర్ రెడ్డి హరితహారం లో భాగంగా మొక్కలు నాటి మన జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ విసరగా జిల్లా ఎస్పీ శ్రీ జె. రంజన్ రతన్ కుమార్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి ఈ రోజు కొత్త జిల్లా పోలీస్ కార్యాలయాల ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం నాగర్ కర్నూల్ జిల్లా ఎస్పీ మనోహర్ కి, మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు కి, నారాయణ పేట జిల్లా ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు కి గ్రీన్ ఛాలెంజ్ విసిరి మొక్కలు నాటి హరితహరాన్ని కొనసాగించాల్సిందిగా జిల్లా ఎస్పీ కోరారు.

ఈ కార్యక్రమంలో డీసీ ఆర్బీ ఇన్స్పెక్టర్ శివకుమార్, గద్వాల్ సి. ఐ చంద్రశేఖర్, అలంపూర్ సి. ఐ సూర్యనాయక్, శాంతినగర్ సి. ఐ శివ శంకర్, ఆర్ఐ అడ్మిన్ నాగేష్ , ఆర్ఐ పెద్దయ్య , సూపరిండెంట్స్ నయీమ్ ,నాగేంద్ర కుమార్, సీసీ లోహిత్ కుమార్, గద్వాల పట్టణ టౌన్ ఎస్సైలు హరిప్రసాద్ రెడ్డి , రూరల్ ఎస్సై ఆనంద్ , ట్రాఫిక్ ఎస్సై, విజయ్ భాస్కర్ , ఆర్ ఎస్సై లు, హౌసింగ్ ఏఈ అనిల్ శాస్త్రి , జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.