వర్షాలతో దుర్గగుడి ఘాట్‌ రోడ్డు మూసివేత

విజయవాడ,జూలై11(జనం సాక్షి ): దుర్గగుడి ఘాట్‌ రోడ్డును అధికారులు మూసివేశారు. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండపైకి వాహనాలకు అనుమతి నిరాకరించారు. ఘాట్‌ రోడ్డులోని కొండ ప్రాంతంలో చిన్న చిన్న కొండరాళ్లు పడుతున్నాయి. మహామండపం ద్వారానే భక్తులు అమ్మవారిని దర్శించుకోవాలని దుర్గగుడి ఈవో భ్రమరాంబ) ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా దుర్గగుడి ఈవోమాట్లాడుతూ… గత మూడు రోజులుగా వర్షం పడుతున్న దృష్ట్యా ఘాట్‌ రోడ్డుపై వాహనాల రాకపోకలను నిలిపివేశామన్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం బస్సులను మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పారు. మిగిలిన వాహనాలను మహామండపం ద్వారానే అనుమతిస్తున్నామన్నారు. శాకాంబరీ ఉత్సవాల దృష్ట్యా పదుల సంఖ్యలో వచ్చే వాహనాలను మహామండపం ద్వారానే అనుమతిస్తామని తెలిపారు. వాతావరణం అనుకూలించాకే వాహనాలను కొండపైకి అనుమతించనున్నట్లు దుర్గగుడి ఈవో ప్రకటించారు.