వర్షాల కోసం వరుణ జపాలు

గండిపేట చెరువులో నిర్వహించిన చిలుకూరు పూజారులు

రాష్ట్రంలో అక్కడక్కడా కురిసిన వర్షాలు

రంగారెడ్డి,ఆగస్ట్‌2(జ‌నం సాక్షి): గండిపేట చెరువులో వరుణయాగం నిర్వహించారు. మంచి వర్షౄలు పడాలని కోరుతూ చిలుకూరు బాలాజీ ఆలయ పూజారులు గురువారంవరుణ యాగం నిర్వహించారు. వర్షాలు బాగా కురిసి లోకకళ్యాణం జరగాలని కోరుతూ ఆలయం సవిూపంలో ఉన్న గండిపేట చెరువులోకి దిగి వర్షాలు కురవాలని వేదమంత్రాలతో జపాలు చేశారు. ప్రతీ సంవత్సరం వరుణయాగం నిర్వహించిన అనంతరం చెరువు నిండి భాగ్యనగర వాసులకు నీళ్ల కొరత లేకుండా ఉంటుందనే నమ్మకం భక్తులలో ఉందని పూజారులు తెలిపారు. కార్యక్రమానికి వేలాదిగా భక్తులు వచ్చి చెరువు ఒడ్డున నిల్చొని కార్యక్రమం తిలకించారు. వరుణపూజలతో సత్ఫలితాలు ఉంటాయని పూజారులు అన్నారు. ఇకపోతే బుధవారం రాత్రి అక్కడక్కడా వర్షాలు కురిసాయి. ఉష్ణోగ్రతలు పెరిగి ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు ఉపశమనం లభించింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలుజిల్లాలపై వరణుడు కరుణించాడు. ఉత్తర తెలంగాణలో పలుచోట్ల మోస్తరు వర్షం పడింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల వానలు పడ్డాయి. హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మాసబ్‌ ట్యాంక్‌, చందానగర్‌, మియాపూర్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌, కొండాపూర్‌ తో పాటు సికింద్రాబాద్‌ లోని పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. అటు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. నిర్మల్‌ జిల్లా బైంసా పట్టణంలో దాదాపు గంటపాటు ఏకధాటిగా వర్షం పడింది. ప్రసిద్ద పుణ్యక్షేత్రం బాసరలో మోస్తరు వర్షం కురిసింది. ఇక మెదక్‌, సిద్దిపేట, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, వరంగల్‌ అర్బన్‌, మహబూబాబాద్‌, జనగాం జిల్లాల్లో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడింది. భద్రాద్రి కొత్తగూడెం ఇల్లందులో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. మరోవైపు ఉపరితల ఆవర్తనం బలంగా ఉండటంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.