వార్తల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా న్యూస్‌ ప్రెసెంటర్స్‌ది కీలక పాత్ర

4

– హైదరాబాద్‌ న్యూస్‌ ప్రజెంటర్స్‌ అసోసియేషన్‌ ఆవిర్భావ సభలో డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి

హైదరాబాద్‌,జూన్‌ 15(జనంసాక్షి):వార్తల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీడియా న్యూస్‌ ప్రెసెంటర్స్‌ది కీలక పాత్ర అని హైదరాబాద్‌ న్యూస్‌ ప్రజెంటర్స్‌ అసోసియేషన్‌ ఆవిర్భావ సభలో డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌ రెడ్డి అన్నారు.తెలుగు ఎలక్ట్రానిక్‌ విూడియాలో మరో కొత్త యూనియన్‌ ఆవిర్భవించింది. హైదరాబాద్‌ న్యూస్‌ ప్రజెంటర్స్‌ అసోసియేషన్‌ పేరుతో ఏర్పడ్డ ఈ యూనియన్లో ప్రధానంగా న్యూస్‌ రీడర్లు, యాంకర్లు, ప్రజెంటర్స్‌ సభ్యులుగా ఉంటారు. హైదరాబాద్‌ బషీర్‌ బాగ్‌ ప్రెస్‌ క్లబ్‌ లో బుధవారం ఐజేయూ, టీయూడబ్ల్యూజే వంటి ప్రధాన యూనియన్‌ నాయకుల సమక్షంలో యూనియన్‌ ఆవిర్భవించింది. నానాటికీ ఎదుగుతున్న ఎలక్ట్రానిక్‌ విూడియా ప్రభావంతో న్యూస్‌ ప్రజెంటర్స్‌ ను కూడా చాలాకాలంగా జర్నలిస్టులుగానే పరిగణిస్తుననారు. న్యూస్‌ ప్రజెంటర్స్‌ పనితీరు, పని ప్రభావం చాలా వరకు రెగ్యులర్‌ జర్నలిస్టులతో సమానంగా ఉండడంతో చాలాకాలంగా తమను కూడా జర్నలిస్టులుగా గుర్తించాలన్న డిమాండ్‌ ఊపందుకంది. ఈ క్రమంలో ఐజేయూ, టీయూడబ్ల్జూజే అందించిన ప్రోత్సాహం, సహకారంతో హైదరాబాద్‌ న్యూస్‌ ప్రజెంటర్స్‌ అసోసియేషన్‌ పురుడు పోసుకుంది. హైదరాబాద్‌ లోని పలు విూడియా సంస్థలకు చెందిన దాదాపు 150 మంది న్యూస్‌ ప్రజెంటర్స్‌ హాజరైన ఈ కార్యక్రమానికి తెలంగాణ డిప్యూటీ సీఎం పద్మాదేవేందర్‌ రెడ్డి చీఫ్‌ గెస్ట్‌ గా హాజరయ్యారు. విూడియాలో వేర్వేరు విభాగాల్లో పనిచేసేవారు యూనియన్లుగా ఏర్పడ్డట్టే.. న్యూస్‌ ప్రజెంటర్స్‌ కూడా ఒక యూనియన్‌ గా ఏర్పడడం శుభ పరిణామమని పద్మాదేవేందర్‌ అభిప్రాయపడ్డారు. న్యూస్‌ ప్రజెంటర్స్‌ ఆఫీసుల్లోనే ఉన్నా.. వీరి ద్వారానే వార్తలు ప్రజల్లోకి వెళ్తాయని, అందువల్ల వీరికే ప్రజలతో ఎక్కువ సంబంధాలు ఉంటాయన్నారు. ఫోన్‌ ఇన్లు, తీసుకున్నప్పుడు, ప్రజలతో ముఖాముఖి లాంటి కార్యక్రమాల్లో అసలైన ప్రజాకోణం వీరిద్వారానే ఆవిష్కృతమవుతుందని అభిప్రాయపడ్డారు. సమైక్య పాలనలో ఉన్నప్పటి పరిస్థితులు, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక మారిన పరిస్థితులపై వార్తలు అందించేది వీరేనని, ఆ విధంగా బంగారు తెలంగాణలో నేరుగా పాల్గొనే అవకాశం న్యూస్‌ ప్రజెంటర్స్‌ కు దక్కిందని ఆమె అన్నారు. అనేక ఒత్తిళ్ల మధ్య పనిచేసే వీరికి జర్నలిస్టులకు వర్తించే అన్ని సంక్షేమ పథకాలను వీరికి కూడా వర్తించేలా సీఎంతో మాట్లాడతానని పద్మాదేవేందర్‌ హావిూ ఇచ్చారు.

ఈ కార్యక్రమానికి గెస్ట్‌ ఆఫ్‌ ఆనర్‌ గా హాజరైన హైదరాబాద్‌ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, హైదరాబాద్‌ బ్యానర్‌ కింద న్యూస్‌ ప్రజెంటర్స్‌ అసోసియేషన్‌ ఏర్పడడటం ఆనందంగా ఉందన్నారు. న్యూస్‌ ప్రజెంటర్స్‌ ముమ్మాటికీ జర్నలిస్టులేనని, హైదరాబాద్‌ లో వీరు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై సీఎంతో చర్చిస్తానని రామ్మోహన్‌ చెప్పారు. ఈ యూనియన్‌ కు ముఖ్య సలహాదారుగా వ్యవహరిస్తున్న టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్‌ అలీ.. ఇలాంటి ఒక యూనియన్‌ ఈపాటికి ఎప్పుడో ఏర్పాటు కావాల్సి ఉండిందని, ఆలస్యమైనప్పటికీ న్యూస్‌ ప్రజెంటర్స్‌ ఒక్కతాటి విూదికి రావడాన్ని టీయూడబ్ల్యూజే స్వాగతిస్తోందన్నారు. న్యూస్‌ ప్రజెంటర్స్‌ ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందించేందుకు తామెప్పుడూ సిద్ధంగా ఉన్నామని విరాహత్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐజేయూ సెక్రటరీ జనరల్‌ దేవులపల్లి అమర్‌, టీయూడబ్ల్యూజే అడ్వయిజరీ మెంబర్‌ కె.శ్రీనివాసరెడ్డి, ఐజేయూ సెక్రటరీ నరేందర్‌ రెడ్డి, హైదరాబాద్‌ న్యూస్‌ ప్రజెంటర్స్‌ అసోసియేషన్‌ అధ్యకుడు పరితోష్‌, ఆ యూనియన్‌ ప్రధాన కార్యదర్శి రుషి, ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులు అమర్‌ నాథ్‌ తదితరులు పాల్గొన్నారు.