వాహనదారులతో ఐఓసి ఆటలు

పెట్రో ధరలు తగ్గింపు నయాపైసా అని తేల్చారు
న్యూఢిల్లీ,మే30(జ‌నం సాక్షి): వాహనదారులను ఇండియన్‌ ఆయిల్‌ కార్పోరేషన్‌ ఫూల్స్‌ చేసింది. తగ్గించిన పెట్రో ధరలతో ఆటలాడుకుంది.  గత 16 రోజులుగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై వాహనదారులకు చుక్కలు చూపించిన ఆయిల్‌ కంపెనీలు నేడు జనానికి సర్‌ప్రైజ్‌ ఇచ్చాయి. వాహనదారులకు ఊరట కల్పిస్తున్నామని.. పెట్రోల్‌ ధరలను 60 పైసలు, డీజిల్‌ ధరలపై 56 పైసలు తగ్గించామంటూ ప్రకటనలు ఇచ్చాయి. కాస్తో కూస్తో ధరలు తగ్గాయని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ అనూహ్యంగా మరో ప్రకటన చేసింది. రెండు మూడు గంటల వ్యవధిలోనే తగ్గింది 60 పైసలు కాదు.. కేవలం 1 పైసా మాత్రమే తగ్గించామంటూ సవరణ ప్రకటన వెలువరించి జనంతో జోకులు చేసింది. పెట్రోల్‌, డీజిల్‌ విక్రయించే ధరలను పోస్టు చేసే తమ వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్య నెలకొందని, పెట్రోల్‌, డీజిల్‌ ధరలను పునఃసవిూక్షిస్తున్నామంటూ ప్రకటించింది. ఇంధన ధరల తగ్గింపు స్వల్పమేనని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ పేర్కొంది. పెట్రోలు, డీజిల్‌ ధరలు ప్రతి రోజూ పెరుగుతుండటంతో సామాన్యుడు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.  మొదటిసారి బుధవారం ఆయిల్‌ కంపెనీలు వీటి ధరలను తగ్గించాయని ప్రకటన రాగానే ఊరట చెందిన వారికి షాక్‌ ఇవ్వడం ఐఓసి వంతయ్యింది. తమ వెబ్‌సైట్‌లో సాంకేతిక లోపం వచ్చిందని, డీజిల్‌, పెట్రోలుపై లీటరుకు తగ్గింపు 60 పైసలు కాదని, కేవలం ఒక పైసా చొప్పున మాత్రమేనని తెలిపింది. ఐఓసీ తీరుపై వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఓసీ జనంతో పరాచికాలు ఆడుతోందని దుయ్యబట్టారు. 16 రోజుల నుంచి పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ 16 రోజుల్లో లీటరు పెట్రోలు ధర దాదాపు రూ.3.80, లీటరు డీజిల్‌ ధర రూ.3.30 చొప్పున పెరిగింది.