.విద్యుత్ మోటార్ల దొంగల పట్టివేత

ఖానాపూర్ ,నియోజకవర్గ ప్రతినిధి ఆగస్టు 23(జనం సాక్షి): ఖానాపూర్ మండలంలోని దిల్వార్పూర్ గ్రామంలో ఇటీవల వ్యవసాయ బావుల వద్ద ఉన్న విద్యుత్ మోటార్లను  దొంగలించిన దొంగలను పట్టుకున్నట్లు ఖానాపూర్ సిఐ గొర్ల అజయ్ బాబు అన్నారు. మంగళవారం సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై రజనీకాంత్ తో కలిసి వివరాలు వెల్లడించారు. జగిత్యాల జిల్లా ఓగులపూర్ గ్రామానికి చెందిన బుక్య అరుణ్ నాయక్, ఇక్కిరి శ్రీనివాస్ అనే ఇద్దరు ఖానాపూర్ మండలంలోని దిల్వార్పూర్ గ్రామానికి చెందిన రాజేశ్వర్, శ్రీనివాస్ లకు చెందిన వ్యవసాయ మోటార్లతో పాటు, ఓగులపూర్ గ్రామానికి చెందిన మరో విద్యుత్ మోటారుతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించిన మోటర్ విడిభాగాలను చోరీ చేసినట్లు వెల్లడించారు.  ఇట్టి దొంగిలించిన విద్యుత్ మోటార్లను ఖానాపూర్ పట్టణంలోని కడమంచి లచ్చన్నకు విక్రయించే సమయంలో పట్టుకున్నట్లు తెలిపారు. మోటర్లు అమ్మిన వ్యక్తులతో పాటు కొన్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్టు సిఐ తెలిపారు. దొంగలను చాకచక్యంగా పట్టుకున్న సిబ్బంది ఉషన్న ,లక్ష్మీ నర్సయ్య, శ్రీనివాస్ లను సీఐ ప్రత్యేకంగా అభినందించారు. రాత్రి వేళల్లో ఆటో , ట్రాలీల్లో అనుమానాస్పదంగా ఏమైనా తరలిస్తే తమకు తెలియజేయాలని అన్నారు.