శంకర్‌ అని పేరు చెప్పిన వ్యక్తి మృతి

ఉస్మానియా మార్చురికి శవం తరలింపు
హైదరాబాద్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): తన పేరు శంకర్‌ అని 108 సిబ్బందికి చెప్పిన ఓ వ్యక్తిని ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందిన సంఘటన ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి ఎల్‌బీనగర్‌ సరూర్‌నగర్‌ దారి పక్కన పడి ఉన్నాడని స్థానికులు 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని అతడిని పరిశీలించారు. అతడు మద్యంతాగి తీవ్ర అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు. తన పేరు శంకర్‌ అని మాత్రమే చెప్పి అతడు ప్రాణాలు విడిచాడు. అతడి ఇతర వివరాలు తెలియలేదు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కొన్నాళ్లుగా అతడు సరూర్‌నగర్‌ దారిలో తిరుగుతూ కనిపించాడని పోలీసులకు స్థానికులు చెప్పారు. అతడిని గుర్తు పట్టే వారుంటే ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని ఎస్‌హెచ్‌ఓ అశోక్‌రెడ్డి తెలిపారు.