*శాంతిభద్రతల నడుమ గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలి*

– సీఐ పి.ఆంజనేయులు
మునగాల, ఆగష్టు 27(జనంసాక్షి): రేపటినుండి మండలంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రులను శాంతిభద్రతల నడుమ గణేష్ ఉత్సవాలను నిర్వహించుకోవాలని మునగాల సీఐ పి.ఆంజనేయులు శనివారం మండల కేంద్రంలోని వాసవి భవన్ లో శ్రీ గణేష్ ఉత్సవ సమితి కోదాడ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మండల ఉత్సవ కమిటీ సమావేశంలో ఆయన సూచించారు. అంతేకాకుండా పర్యావరణ కాలుష్యము లేకుండా మట్టి విగ్రహాలను వాడాలని, అశ్లీలతకు తావులేకుండా నిర్వహించుకోవాలని, విద్యుత్ పర్మిషన్ కు 5వందల రూపాయల నుండి వెయ్యి రూపాయల వరకు మండప సామర్థ్యం చొప్పున డిడిని తీయాలని, మైక్ పర్మిషన్ తీసుకోవాలని, ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, మండపాలు నిర్వహించే చుట్టుపక్కలా విద్యుత్ ఏర్పాటు చేయాలని, పూజా కార్యక్రమాలను తగిన సమయంలోనే నిర్వహించుకోవాలని, తప్పకుండా విద్యుత్ పర్మిషన్ తీసుకోవాలని, విగ్రహం ఏర్పాటు చేసే స్థలంలో ఇంటి యజమాని పర్మిషన్ కూడా ఉండాలని సూచించారు. అంతేకాకుండా గణేష్ ఉత్సవాల కోసం చందాలను వసూలు చేసే విషయంలో బలవంతం చేయరాదని, విగ్రహాలను రోడ్లపై ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదని, మతాచారాలకతీతంగా ఏర్పాటు చేసుకోవాలని, మద్యపానం పేకాటలకు సంబంధించిన విషయాలలో పూర్తిగా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు. గ్రామాలలో ఉన్న పాఠశాలలు, ఆశ్రమాలు, చర్చిలు మసీదులకు ఆటంకం కలుగకుండా ఉత్సవాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గ శ్రీ గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు కనగాల నారాయణ,కోదాడ నియోజకవర్గస్థాయి ప్రధాన కార్యదర్శి వేమూరి సత్యనారాయణ, కన్వీనర్ ఓరుగంటి కిట్టు మరియు అన్ని పార్టీల నాయకులు, అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, సొసైటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.